అస్సాం ముఖ్యమంత్రి ఎవరో తేల్చి చెప్పిన బీజేపీ

ABN , First Publish Date - 2021-05-09T19:39:47+05:30 IST

వీరిద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు.

అస్సాం ముఖ్యమంత్రి ఎవరో తేల్చి చెప్పిన బీజేపీ

గువాహటి : అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను బీజేపీ శాసన సభా పక్ష నేతగా శాసన సభ్యులు ఆదివారం ఎన్నుకున్నారు. ఆయన గతంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే. 


బీజేపీ శాసన సభా పక్ష సమావేశానికి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, బీజేపీ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ కేంద్ర పరిశీలకులుగా హాజరయ్యారు. వీరి సమక్షంలో హిమంత బిశ్వ శర్మను బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. శర్మ పేరును మాజీ ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, బీజేపీ ఎమ్మెల్యే నందిత గర్లోసా ప్రతిపాదించారు. ఈ సమావేశంలో అస్సాం బీజేపీ ఇన్‌ఛార్జి బైజయంత్ పాండా కూడా పాల్గొన్నారు. 


సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వ శర్మ అస్సాంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై శనివారం న్యూఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో చర్చించారు. 


సోనోవాల్ సహజ సిద్ధ స్థానిక సోనోవాల్-కచరి గిరిజన నేత. హిమంత బిశ్వ శర్మ అస్సామీ బ్రాహ్మణుడు. ఆయన ఈశాన్య ప్రజాస్వామిక కూటమి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. 


హిమంత బిశ్వ శర్మ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అస్సాం గవర్నర్ జగదీశ్ ముఖిని కలిసి, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పే అవకాశం ఉంది. 

Updated Date - 2021-05-09T19:39:47+05:30 IST