విజయ్‌ సంకల్ప్‌ సభకు తరలిన బీజేపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-07-04T06:26:35+05:30 IST

సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ ఆదివారం నిర్వహించిన విజయ్‌సంకల్ప్‌ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు.

విజయ్‌ సంకల్ప్‌ సభకు తరలిన బీజేపీ శ్రేణులు
జెండా ఊపి వాహన శ్రేణిని ప్రారంభిస్తున్న గూడూరు నారాయణరెడ్డి

యాదాద్రి, జూలై 3(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో బీజేపీ ఆదివారం నిర్వహించిన విజయ్‌సంకల్ప్‌ సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు తరలివెళ్లారు. ప్రధాని నరేంద్రమోదీ హాజరైన ఈ సభను విజయవంతం చేసేందుకు పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ జాతీయ కార్యవర్గసభ్యులు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి, ప్రధాని సభకు బూత్‌కమిటీల వారీగా కదలిరావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నగరశివారులోని జిల్లా నుంచి కనీసం 30వేల మంది తరలించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ మేరకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆదివారం మధ్యాహ్నం జిల్లా నుంచి బస్సులు, కార్లు, రైళ్లలో తరలివెళ్లారు. అంతేగాక పలు జిల్లాల నుంచి కార్యకర్తలు వాహనాల్లో రావడంతో హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-విజయవాడ రహదారులు రద్దీగా కన్పించాయి. ఆదిలాబాద్‌, వరంగల్‌, నల్లగొండ జిల్లాల నుంచి ప్రజలను ప్రత్యేక రైళ్లలో తరలించారు. కాజీపేట, జనగాం, ఆలేరు, భువనగిరి రైల్వేస్టేషన్ల నుంచి పార్టీ నాయకులు వెళ్లారు. గూడూరు టోల్‌గేట్‌ వద్ద బహిరంగ సభకు బయలుదేరే వాహన శ్రేణికి పార్టీ రాష్ట్ర నేత గూడూరు నారాయణరెడ్డి కొబ్బరికాయ కొట్టి జెండా ఊపి ప్రారంభించారు. భువనగిరితో పాటు ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, రామన్నపేట నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు ప్రత్యేక వాహనాల్లో సికింద్రాబాద్‌ సభకు వెళ్లాయి.

Updated Date - 2022-07-04T06:26:35+05:30 IST