Bihar political crisis: నితీశ్ ప్రమాణ వేళ నిరసనలకు బీజేపీ నిర్ణయం
ABN , First Publish Date - 2022-08-10T03:00:30+05:30 IST
పాట్నా: బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న వేళ భారతీయ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.
పాట్నా: బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న వేళ భారతీయ జనతా పార్టీ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది. జేడియూ అధినేత నితీశ్ కుమార్ ప్రజాతీర్పునకు విరుద్ధంగా తమతో అనుబంధాన్ని తెంచుకుని, ఆర్జేడీతో చేతులు కలపడాన్ని నిరసిస్తూ మూడు రోజుల పాటు ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది. బుధవారం ఉదయం పది గంటల నుంచి నిరసన ప్రదర్శనలు ప్రారంభమౌతాయి. పాట్నాలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఈ ప్రదర్శనలు ప్రారంభిస్తారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ తక్కువ మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నా తాము నితీశ్ను ముఖ్యమంత్రిని చేశామని, అయినా కూడా ఆయన బీజేపీని ముంచేశారనే విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారు. తాము నితీశ్ను పంపించివేయాలేదని, తనకు తానుగా బీజేపీని వదిలివెళ్లిపోయారనే విషయాన్ని కూడా ప్రచారం చేస్తారు.
మరోవైపు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు. 7 పార్టీలకు చెందిన మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తున్నారని నితీశ్ గవర్నర్కు సమర్పించిన లేఖలో తెలిపారు.