BANDI తీరుతో బీజేపీ పార్టీకి గండి పడుతుందా..ఒంటెత్తు పోకడలు నచ్చని నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారా?
ABN , First Publish Date - 2022-02-26T17:58:45+05:30 IST
తెలంగాణలో అధికారం కోసం కలలు గంటున్న బీజేపీలో ఇంటిపోరు మొదలైంది. పార్టీని పల్లె నుంచి నగరం దాకా పటిష్టపరచాలని...
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్కు ఇంటిపోరు ఎక్కువైందా? అసమ్మతి వర్గమంతా తిరుగుబాటు చేసేందుకు సిద్ధమైందా.. ఇందుకోసం రహస్య సమావేశాలూ నిర్వహిస్తున్నారా? సంజయ్ ఒంటెత్తు పోకడలు నచ్చని నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చారా?త్వరలోనే తమ సత్తా ఏమిటో చూపుతామంటున్నారా? అసలు తెలంగాణ బీజేపీలో ఏంజరుగుతోంది..? అనే మరిన్ని విషయాలు ఇన్సైడ్ లో చూద్దాం..
తెలంగాణ బీజేపీలో ఇంటిపోరు
తెలంగాణలో అధికారం కోసం కలలు గంటున్న బీజేపీలో ఇంటిపోరు మొదలైంది. పార్టీని పల్లె నుంచి నగరం దాకా పటిష్టపరచాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోపక్క బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది నేతలు ఆగ్రహంతో ఉన్నారట. వీరంతా సంజయ్కు వ్యతిరేకంగా ఓ కూటమి ఏర్పాటుకు రంగం సిద్దం చేస్తున్నారట. ఇప్పటికే బండికి వ్యతిరేకంగా కరీంనగర్లో ఈ వర్గం రహస్య సమావేశాలు నిర్వహించినట్టు బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, పార్టీ కార్యక్రమాలను నేరుగా ప్రకటించడంపై వీరంతా బండి సంజయ్పై రగిలిపోతున్నట్టు కాషాయపార్టీ కార్యకర్తలు చెపుతున్నారు.
హైదరాబాద్లో అసంతృప్త నేతల రహస్యభేటీ
బండి సంజయ్పై తమ పోరును మరింత ముమ్మరం చేసేందుకు అసంతృప్త నేతలు హైదరాబాద్లో సమావేశం కావడం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ రహస్య బేటీలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నట్టు కమలంపార్టీలో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్రావు, వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, రాజేశ్వరరావు, నల్లగొండ నుంచి మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి, మహబూబ్నగర్ నుంచి నాగురావు నామోజీ, హైదరాబాద్ నుంచి వెంకటరమణ, వెంకట్రెడ్డి, నిజామాబాద్ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్, మల్లారెడ్డి, ఆదిలాబాద్ నుంచి గోనె శ్యామ్సుందర్రావు హాజరయ్యారని చెపుతున్నారు. గతంలోకూడా వీరు ఇలాంటి రహస్య సమావేశాలు నిర్వహించారు. సంజయ్ ఒంటెత్తుపోకడలు తమను ఇబ్బంది పాలు చేస్తున్నాయని వీరంతా వాపోతున్నారని సమాచారం. సీనియర్లకు ప్రయార్టీ ఇవ్వని విషయంకేంద్ర మంత్రి కిషన్రెడ్డికి కూడా తెలుసంటున్నారు.
హైకమాండ్ ఆదేశాలను లైట్ తీసుకున్న సీనియర్లు
మరోపక్క పార్టీకి నష్టం చేకూర్చేవారిని సహించేది లేదంటూ ఇటీవల బండి సంజయ్ హెచ్చరించారు. ఎంతటివారినైనా ఉపేక్షించమంటూ ఆయన చేసిన హెచ్చరిక సీనియర్లనుహర్ట్ చేసిందంటున్నారు.నిజానికి అసంతృప్త నేతలలో ఎక్కువమంది తొలినుంచి పార్టీని నమ్ముకున్నవారే. కానీ వీరికి తగిన ప్రయార్టీ లేకపోవడం, ముందు వచ్చిన చెవుల కన్నావెనుకొచ్చిన కొమ్ములువాడి అన్నట్టు బండి సంజయ్ వ్యవహరిస్తున్నారనే బాధ వీరిలో ఉంది. అయితే క్రమశిక్షణ పేరు చెప్పి వీరి నోరు మూయించేందుకు బీజేపీ స్టేట్ కమిటీబాగానే ప్రయత్నాలు చేసింది. ఇందుకోసం సీనియర్ నేతల ఇంద్రసేనారెడ్డితో ఒక కమిటీని ఏర్పాటుచేసింది.
కరీంనగర్కు చెందిన ఇద్దరు నేతలపై వేటు వేయాలనుకున్నప్పటికీ కొంతకాలం వేచి చూద్దామని భావించినట్టు భోగట్టా. గతంలో ఇలా రహస్య సమావేశాలు నిర్వహించడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలుఇచ్చినా సీనియర్లు లైట్ తీసుకున్నారు. ఇక హైదరాబాద్లోని హైదర్గూడలో రహస్యంగా సమావేశమైన సీనియర్లు తాము కేవలం పార్టీ బలోపేతం గురించి మాత్రమే మాట్లాడుకున్నామని లీకులు ఇవ్వడం, పైగాసమయం వచ్చినపుడు అన్నీ చెపుతామనడం బీజేపీ కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది.