బెంగాల్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు

ABN , First Publish Date - 2021-05-03T01:17:02+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన వేళ అరాంబాగ్‌లో బీజేపీ కార్యాలయం

బెంగాల్‌లో బీజేపీ కార్యాలయానికి నిప్పు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన వేళ అరాంబాగ్‌లో బీజేపీ కార్యాలయం తగలబడడం కలకలం రేపింది. కార్యాలయం మంటల్లో ఆహుతవుతున్న వీడియోను పోస్టు చేసిన బీజేపీ నేతలు, కార్యకర్తలు తృణమూల్‌పై మండిపడ్డారు. ఇది ఆ పార్టీ పనేనని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ హింసకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీ ఆరోపణలపై మమత బెనర్జీ  స్పందించారు. తమ అరాంబాగ్ అభ్యర్థి సుజాతా మండల్‌ను బీజేపీ కార్యకర్తలు వెంబడించారని, పోలింగ్ బూత్ సమీపంలో ఆమెపై దాడిచేసి తలపై కొట్టారని పేర్కొన్నారు. హూగ్లీకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాంబాగ్‌లోని బీజేపీ తాత్కాలిక కార్యాలయం మండిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీఎంసీ గూండాలు అరాంబాగ్‌లోని బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టేశారని బీజేపీ ఐటీసెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. వచ్చే ఐదేళ్లూ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ.. బీజేపీ కార్యాలయం మంటలకు ఆహుతవుతున్నా టీఎంసీ శ్రేణులు ఆపే ప్రయత్నం చేయలేదని, అంతేకాక, బిష్ణుపూర్‌లోని తమ బూత్ ఏజెంట్ ఇంటిని కూడా తగలబెట్టేశారని మాలవీయ ఆరోపించారు. కాగా, తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో ఇప్పటి వరకు టీఎంసీ 192 స్థానాల్లో విజయం సాధించగా, మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 61 స్థానాల్లో గెలుపొందగా మరో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.  

Updated Date - 2021-05-03T01:17:02+05:30 IST