ప్రభుత్వ భూములను కాపాడాలి
ABN , First Publish Date - 2022-01-26T05:57:01+05:30 IST
ప్రభుత్వ భూములను కాపాడాలి
బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి
నర్సంపేట, జనవరి 25 : నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వభూములు కబ్జాకు గురికాకుండా కాపాడాలని బీజేపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కార్యకర్తలతో కలిసి వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఆర్డీవో పవన్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని గ్రీన్లాండ్, అసైన్డ్ భూములను గుర్తించి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలన్నారు. పట్టణంలో 800 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవని, ప్రస్తుతం ఎంత భూమిఉంది ఎక్కడెక్కడ ఉందో నిర్ధారించాలన్నారు. రియలెస్టేట్ వ్యాపారులు అసైన్డ్ భూములను అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. అయ్యప్ప ఆలయం సమీపంలోని అసైన్డ్ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చదునుచేసి, అమ్మకానికి పెట్టారన్నారు. జంతుసంరక్షణ కేంద్రంకు కేటాయించిన స్థలంలో ప్రవేటు వ్యక్తులు బోరువేసి ఆక్రమించుకున్నారని ఆరోపించారు. లెనిన్కా లనీలో ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు కబ్జా చేశారన్నారు. మల్లంపెల్లిరోడ్, రాజుపేట పంచాయతీ పరిధిలోని ట్రైబల్ భూములను ఆ క్రమించి లక్షలాది రూపాయల వంతున అమ్మకానికి పెట్టారన్నారు. ఈ స్థలంలో గతంలో పనిచేసిన కలెక్టర్ హరిత ఈ భూములను అమ్మకాలు జరుపవద్దని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు లెక్కచేయడం లేదని అన్నారు. మినీస్టేడియం పక్కనఉన్న అసైన్డ్ భూమిని అధికార పార్టీ నాయకుల అండదండలతో ఆక్రమించి, అమ్మకానికి పెట్టారన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు స్పందించి ప్రభుత్వ, అసైన్డ్ భూములను గుర్తించి హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడుండపెల్లి నర్సింహరాములు, బాల్నె జగన్, గుంటి వీర ప్రకాశ్, కొంపెల్లి రాజు, తక్కళ్ళపెల్లి ఉమ, నాయకులు పాల్గొన్నారు.