రాజ్యసభకు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ!

ABN , First Publish Date - 2020-11-28T04:22:07+05:30 IST

అందరూ ఊహించినట్టుగానే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని రాజ్యసభకు పంపించేందుకు బీజేపీ అధిష్టానం రంగం...

రాజ్యసభకు బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ!

న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ మోదీని రాజ్యసభకు పంపించేందుకు బీజేపీ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. బీహార్ రాజ్యసభ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా సుశీల్ మోదీ పేరును ఖరారు చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి బీహార్ అసెంబ్లీలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్న నేపథ్యంలో రాజ్యసభకు సుశీల్ మోదీ ఎన్నిక దాదాపు ఖరారైనట్టే. అయినప్పటికీ ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి తన అభ్యర్థిని నిలిపాలని నిర్ణయించుకుంటే వచ్చే నెల 14న ఈ స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. లోక్‌ జనశక్తి పార్టీ (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు, కేంద్రమంత్రి రాం విలాస్ పాశ్వాన్ మృతితో ఈ స్థానం ఖాళీ అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకి వ్యతిరేకంగా పోటీచేయాలని ఎల్జేపీ నిర్ణయించుకోవడంతో... ఎన్డీయే నుంచి ఆ పార్టీ నిష్క్రమించింది. దీంతో ఆ పార్టీకి కోటా కింద ఇచ్చిన స్థానాన్ని తిరిగి సాధించుకోవాలని బీజేపీ అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల బీహార్‌‌లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ... సుశీల్ మోదీని రాష్ట్ర క్యాబినెట్‌లోకి తీసుకోకుండా పక్కనబెట్టినట్టు చెబుతున్నారు.  

Updated Date - 2020-11-28T04:22:07+05:30 IST