Minister KTR.. మీ నాన్నను అడిగి తెలుసుకో.. : రాజాసింగ్ కౌంటర్
ABN , First Publish Date - 2021-10-24T17:37:54+05:30 IST
Minister KTR.. మీ నాన్నను అడిగి తెలుసుకో..
- పెట్రోల్ ధరలపై వాహనదారులతో మాట్లాడండి
- కేటీఆర్ సూటిప్రశ్న
హైదరాబాద్ : పెట్రోలు బంక్ వద్దకు వెళ్లి పెరుగుతున్న పెట్రోలు, డీజిలు ధరలపై వాహనదారులు ఏమనుకుంటున్నారో ఎందుకు తెలుసుకోరు? అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రశ్నించారు. అలాగే, సిలిండర్ ధరపై ఒక గృహస్థుడిని విచారించండి.. అని సూచించారు. జీడీపీ అంటే.. గ్యాస్, డీజిల్, పెట్రోల్.. విన్నారా?. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. అదిరింపులు మానుకుని, ప్రజల మనసులు దోచుకోవాలని రాజాసింగ్కు హితవు పలికారు.
అవగాహన లేదనుకుంటా..: రాజాసింగ్
దేశంలో పెట్రోలు ధరలు ఎందుకు పెరుగుతాయో మీకు అవగాహన లేదనుకుంటా.. యూపీయే హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన మీ తండ్రి (సీఎం కేసీఆర్)ని అడిగి తెలుసుకోండి అని రాజాసింగ్, మంత్రి కేటీఆర్కు కౌంటర్ ఇచ్చారు. తాను పాతబస్తీలో రోడ్ల దుస్థితిపై కేటీఆర్కు ట్వీట్ చేస్తే, దానికి సమాధానం ఇవ్వకుండా ఆయన మరో అంశం ప్రస్తావించడం విడ్డూరమన్నారు. తాను ట్వీట్ చేసిన ఆరురోజులకయినా కేటీఆర్ స్పందించినందుకు ధన్యవాదాలు అంటూ ఎద్దేవా చేశారు.
పాతబస్తీలో కేటీఆర్ గంటపాటు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తే ఆయనకు వెన్నునొప్పి రావడం ఖాయమని రాజాసింగ్ పేర్కొన్నారు. కేటీఆర్ ట్విటర్లోనే ఉంటరు.. భోజనం చేస్తరు.. పడుకుంటరు.. అని విమర్శించారు. పెట్రోలులో రాష్ట్ర వాటా చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? అసలు నిజం మీరు చెప్పరా? అని నిలదీశారు. రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే కేంద్రం పన్నుల రూపేణా లీటరుకు రూ. 41 చొప్పున ఇచ్చే వాటాను రద్దుచేసుకోవాలని రాజాసింగ్ సూచించారు.