Raghunandan Rao: వాసాలమర్రికి కేసీఆర్ వెళ్లనే లేదు: రఘునందన్రావు
ABN , First Publish Date - 2022-05-20T01:12:36+05:30 IST
కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (Cm Kcr), మంత్రి కేటీఆర్ (Minister Ktr) పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghunandan Rao) ఓ ప్రకటనలో అన్నారు. గ్రామాలకు నేరుగా ...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ (Cm Kcr), మంత్రి కేటీఆర్ (Minister Ktr) పని చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు (Bjp Mla Raghunandan Rao) ఓ ప్రకటనలో అన్నారు. గ్రామాలకు నేరుగా నిధులు ఇవ్వడం కొత్తకాదన్న సంగతి ముఖ్యమంత్రికి తెలియదా అని నిలదీశారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తుందన్నారు. నేరుగా పంచాయతీలకు నిధులు ఇస్తే అవినీతి తగ్గుతుందని చెప్పారు. నేరుగా గ్రామాలకు నిధులు ఇస్తే తప్పేముందో చెప్పాలని డిమాండ్ చేశారు. పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిధులు ఇచ్చాయో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళుగా వ్యవసాయ పని ముట్లకు సబ్సిడీ ఇవ్వడం లేదని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు చేస్తున్న అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే పంచాయతీలకు కేంద్రప్రభుత్వం నిధులు ఇస్తుందని రఘునందన్ రావు తెలిపారు.
‘‘కేంద్ర అవార్డులు కేవలం కాంగ్రెస్, బీజేపీ ఎంపీలుగా ఉన్న గ్రామాలకే ఎందుకు వచ్చాయి. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాలకు ఎందుకు రావడం లేదు. కేసీఆర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో పర్యటించి అక్కడి వాస్తవాలు తెలుసుకోవాలి. హుజూరాబాద్ ఎన్నికల తరువాత వాసాలమర్రికి కేసీఆర్ వెళ్లనే లేదు. ఇంటికి పది లక్షలు ఇచ్చిన చింతమడకకు వెళ్తే వాస్తవాలు తెలుస్తాయి.’’ అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.