సీఎం కేసీఆర్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2022-03-17T18:33:58+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సీఎం కేసీఆర్‌కు ఈటల స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్ దుర్మార్గపు ఆలోచనే బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్ అని అన్నారు. సీఎం ప్రజలు బండకేసి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండా అని... 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ను మింగిన చరిత్ర కేసీఆర్‌దని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను పీకేలు కాపాడలేరని... తెలంగాణలో చైతన్యమే నిలిచి గెలుస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కాదు.. కేసీఆర్ అవమానిస్తోంది‌ శాసనసభ మర్యాదను అని తెలిపారు. సీఎం కేసీఆర్‌తో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఈటల సవాల్ విసిరారు.


  కేసీఆర్, హరీష్ రావుకు దమ్ముంటే బడ్జెట్‌పై తనతో చర్చకు రావాలన్నారు. హరీష్ రావుది దొంగలెక్కలు.. కాకి లెక్కల బడ్జెట్ అని కాగ్ నిబేదిక చెప్పిందని తెలిపారు. తాగుడు వలన తెలంగాణలో భర్తలు లేని ఆడబిడ్డలు పెరిగిపోతున్నారన్నారు. కార్మిక సంఘాలను రద్దు చేయించిన దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. ఆర్టీసీ, మున్సిపల్ కార్మికులను కేసీఆర్  తొలగించాలన్నప్పుడు తాను అడ్డుపడ్డానని గుర్తుచేశారు. ఏడాదికి 90 రోజులు జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను 30 రోజులకు తీసుకొచ్చిన ఘ‌నగ కేసీఆర్‌దన్నారు. మానవ సంబంధాలు తెలియని.. నైతికత లేని వ్యక్తి కేసీఆర్ అని మండిపడ్డారు.


ప్రజలు, రాజ్యాంగం కల్పించిన అవకాశంతోనే తాను ముఖ్యమంత్రి అయిన విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ నైతికత ఉంటే హుజురాబాద్ ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేవారని తెలిపారు. కేసీఆర్ అహంకారాన్ని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన యుద్ధం హుజురాబాద్ ఎన్నికలని చెప్పారు. సభలో ఉద్యమకారుడు ఈటల లేకుండా ఉండాలని సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2022-03-17T18:33:58+05:30 IST