Punjab: BJP నేతలను 12 గంటలపాటు బంధించిన రైతులు
ABN , First Publish Date - 2021-07-13T00:05:54+05:30 IST
అయితే తాము శాంతియుతంగా నిరసన చేస్తుంగా భూపేష్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలతో తమను దూషించారని అందుకే తాము బీజేపీ నేతలను బంధీ చేసి నిరసన చేపట్టినట్లు రైతులు తెలిపారు. ఆదివారం రాత్రి బంధీ అయిన నేతలను సోమవారం
చండీగఢ్: పంజాబ్లో భారతీయ జనతా పార్టీ నేతలను రైతులు బంధించారు. పార్టీ సమావేశంలో భాగంగా సమావేశమైన నేతలను బయటికి రాకుండా ఇంటి చుట్టూ చేరి నీళ్లు, విద్యుత్ ఆపేశారు. సుమారు 12 గంటల అనంతరం పోలీసులు అతి కష్టం మీద బీజేపీ నేతలను క్షేమంగా విడిపించారు. పంజాబ్లోని రాజ్పురలో ఈ ఘటన జరిగింది.
జిల్లాస్థాయి సమావేశంలో భాగంగా బీజేపీ పంజాబ్ జనరల్ సెక్రటరీ భూపేష్ అగర్వాల్ సహా మరికొంత మంది నేతలు రాజ్పురలోని భారత్ వికాస్ పరిషత్ భవనంలో సమావేశమయ్యారు. అనంతరం అక్కడి చేరుకున్న రైతులు వారిని బయటికి రానివ్వకుండా నిరసన చేపట్టారు. ఈ విషయమై అగర్వాల్ మాట్లాడుతూ ‘‘మా సమావేశం కొనసాగుతుండగా కొంత మంది రైతులు వచ్చి అంతరాయం కలిగించారు. నీళ్లు, విద్యుత్ ఆపేసి హడావుడి చేశారు’’ అని పేర్కొన్నారు.
స్థానిక కౌన్సిలర్ శాంతి స్వరూప్ని రైతులు వెంబడిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ఆయన వెంట కొంత మంది పోలీసులు సైతం పరిగెడుతూ ఉండడం.. వెనకాల రైతులు వెంబడిస్తుండడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆయనపై దాడి లాంటిదేమీ జరగలేదని పోలీసులు తెలపడం గమనార్హం.
తాము శాంతియుతంగా నిరసన చేస్తుంగా భూపేష్ అగర్వాల్ అనుచిత వ్యాఖ్యలతో తమను దూషించారని అందుకే తాము బీజేపీ నేతలను బంధీ చేసి నిరసన చేపట్టినట్లు రైతులు తెలిపారు. ఆదివారం రాత్రి బంధీ అయిన నేతలను సోమవారం ఉదయం పోలీసులు విడిపించారు. అంతకు ముందు ఈ విషయమై పంజాబ్ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ‘‘వారు క్షేమంగా, భద్రత మధ్యే విడుదల అవుతారని’’ జస్టిస్ సువిర్ సేఘాల్ తెలిపారు.
మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు భారతీయ జనతా పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. చట్టాలను రద్దు చేసి కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని 8 నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దులో నిరవధిక ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.