Nabanna Avijan : బీజేపీ నేతలు సువేందు, లాకెట్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-13T19:39:24+05:30 IST

ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని

Nabanna Avijan : బీజేపీ నేతలు సువేందు, లాకెట్ అరెస్ట్

కోల్‌కతా : ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అవినీతిపై పోరాటంలో భాగంగా కోల్‌కతాలో మంగళవారం నాబన్న కవాతును నిర్వహిస్తోంది. దీనిలో పాల్గొనేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీ, ఆ పార్టీ నేత సువేందు అధికారిలను పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేశారు. 


పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సచివాలయాన్ని నాబన్న అంటారు. ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు బీజేపీ నాబన్న మార్చ్‌ను తలపెట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వందలాది మంది బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చారు. పోలీసులు కొందరు కార్యకర్తలను మార్గమధ్యంలోనే అరెస్టు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. రాణీగంజ్ రైల్వే స్టేషన్ వెలుపల పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. సువేందు అధికారి, లాకెట్ ఛటర్జీలను అలీపూర్ వద్ద అరెస్టు చేశారు. 


మూడు చోట్ల నుంచి ప్రదర్శనగా వచ్చి, నాబన్న కవాతులో పాల్గొనాలని బీజేపీ ప్రణాళిక రచించింది. సువేందు అధికారి నేతృత్వంలో సత్రగంచి నుంచి, సుకాంత మజుందార్ నాయకత్వంలో హౌరా మైదానం నుంచి, దిలీప్ ఘోష్ నేతృత్వంలో కళాశాల వీథి నుంచి ప్రదర్శనలను నిర్వహించి, సచివాలయం వద్దకు చేరుకోవాలని బీజేపీ ప్రయత్నించింది. 


కోల్‌కతా, హౌరాలలో ట్రాఫిక్‌పై పోలీసులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. హౌరా బ్రిడ్జ్, సెకండ్ హుగ్లీ బ్రిడ్జ్, ఎస్‌ప్లనేడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. సువేందు అధికారి ఇచ్చిన ట్వీట్‌లో, మమత బెనర్జీ పోలీసులు ప్రజాస్వామ్యబద్ధమైన రాజకీయ కార్యక్రమాన్ని అణచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సత్రగంచిలో ఏర్పాటు చేసిన స్టీల్ బారికేడ్లు ఆమె ఆందోళన, పిరికితనాలను వెల్లడిస్తున్నాయని తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభంజనానికి ఎంత పెద్ద గోడలైనా నిలువలేవని హెచ్చరించారు. త్వరలోనే ఈ గోడలు పగిలిపోతాయని స్పష్టం చేశారు. 


Updated Date - 2022-09-13T19:39:24+05:30 IST