డ్రగ్స్ విక్రేతలను ఎన్కౌంటర్ చేయండి
ABN , First Publish Date - 2022-04-04T10:00:48+05:30 IST
రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయించేవారిని అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్కు ...
- కొనేవారిపైనా కఠిన చర్యలు తీసుకోండి: రాజాసింగ్
- కేటీఆర్ కెప్టెన్సీలోనే డ్రగ్స్ దందా: అర్వింద్
హైదరాబాద్/న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయించేవారిని అవసరమైతే ఎన్కౌంటర్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ అమ్మేవారిపైనా, కొనేవారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ విషయంలో తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. డ్రగ్స్తో యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఒక ప్రకటనలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్రహిత తెలంగాణ సమాజాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ కల్చర్ ఎందుకు వస్తోంది? పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు. టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ డ్రగ్స్కు సూపర్ మార్కెట్గా మారిందని బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు సోలంకి శ్రీనివాస్ విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాలనలో హైదరాబాద్ పరిస్థితి ఉడ్తా పంజాబ్గా మారిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కేటీఆర్ కెప్టెన్సీలోనే డ్రగ్స్ దందా జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఆదివారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. అలాగే కేటీఆర్ కనుసన్నల్లో తెలంగాణలో రీసైకిల్ బియ్యం దందా కూడా జరుగుతోందని, ఈ దందాతో ఆయన రూ.50 వేల కోట్లు సంపాదించారని ఎంపీ ఆరోపించారు.