తప్పు చేయనప్పుడు భయం దేనికి..?
ABN , First Publish Date - 2022-06-14T16:26:31+05:30 IST
నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది.
- కాంగ్రెస్వి బ్లాక్మెయిల్ రాజకీయాలు
- బీజేపీ సూటి ప్రశ్న
బెంగళూరు, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): నేషనల్ హెరాల్డ్ కుంభకోణంలో చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. మల్లేశ్వరంలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఐటీ, బీటీ, ఉన్నత విద్యాశాఖల మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఒకవేళ తప్పు చేయనప్పుడు భయం దేనికన్నారు. దర్యాప్తు సంస్థలు కేంద్రప్రభుత్వ గుప్పిట్లో ఉన్నాయన్న ఆరోపణను తోసిపుచ్చారు. ఈడీ దర్యాప్తునకు కాంగ్రెస్ అగ్రనేతలు సహకరించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటే ప్రజలు సైతం ఆమోదిస్తారన్నారు. ఆరు దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ నేతలకు చట్టాల గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ ఈ విషయంలో ముందుకు సాగుతుందంటే కనీస పరిజ్ఞానం ఉన్నవారు కూడా విశ్వసించరన్నారు. అవినీతికి కేరాఫ్ అడ్ర్సగా ఉన్న కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు వెలుగుచూశాయని, అందులో ఇదొకటన్నారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ తమపై కాంగ్రెస్ ఆరోపించడాన్ని ఎద్దేవా చేశారు. పార్టీ అధికార ప్రతినిధి ఏజీ మహేశ్ మాట్లాడుతూ నైతికంగా కాంగ్రెస్ పతనావస్థకు చేరుకుందన్నారు. ఉనికిని చాటుకునేందుకు దేశవ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారన్నారు. 5వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని రూ.50 లక్షలకే యంగ్ ఇండియన్ సంస్థకు అప్పగించడం వెనుక కుట్ర కోణం లేదా..? అని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ చలవాది నారాయణస్వామి మాట్లాడుతూ నకిలీ గాంధీలు చట్టానికి అతీతులా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కాంగ్రెస్ ధర్నాలపై స్పందిస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తె లిపే అధికారం అన్ని పార్టీలకు ఉందన్నారు. అయితే అవినీతిలో పీకల్లోతు కూరుకున్న కాంగ్రెస్ ఎన్ని నిరసనలు చేసినా ప్రజలు విశ్వసించబోరన్నారు.