రాష్ట్ర ప్రజలను జగన్ చంపుకు తింటున్నారు: Vishnukumar raju
ABN , First Publish Date - 2022-02-10T18:22:40+05:30 IST
విశాఖకు సీఎం వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారని... మూడేసి గంటల పాటు ట్రాఫిక్ను జామ్ చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖపట్నం: విశాఖకు సీఎం వచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెట్టారని... మూడేసి గంటల పాటు ట్రాఫిక్ను జామ్ చేశారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలను జగన్ చంపుకు తింటున్నారన్నారు. ఈ సారి జగన్ విశాఖకు వస్తే రాత్రి 9 తర్వాత... ఉదయం 6 గంటల లోపు రావాలని కోరుతున్నామని అన్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఒక్క మందు షాపులు మినహా అన్ని షాపులు మూయించడం ఘోరమని మండిపడ్డారు. విశాఖలో టీటీడీ దేవస్థానాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో సీఎం డేట్ ఫిక్స్ చేయాలని... లేదంటే తాము తేదీని ఫిక్స్ చేస్తామని చెప్పారు.
10 రోజులు గడువు ఇస్తున్నామని.. ఈలోపు డేట్ను ఫిక్స్ చేసి ప్రారంభించాలని... లేదంటే దేవాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. జగన్ ది రాక్షస పాలన.. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. అమరావతిని అభివృద్ధి చేయలేదు, కానీ అమరావతి భూములు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. చలో విజయవాడలో ఉద్యోగుల ఐక్యత బాగా కనబడిందని..అద్భుత ప్రదర్శన చేశారని కొనియాడారు. ఉద్యోగ సంఘాల నేతలను బయపెట్టి, ఉద్యమాన్ని నీరుకార్చారన్నారు. పోలీసు యంత్రాంగం పక్ష పాత వైఖరిని చూపిస్తోందని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఢిల్లీ వెళ్లి చెప్పామని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు.