Telanganaలో కాషాయ శకం ప్రారంభం.. కేసీఆర్ను గద్దె దించుతాం: Vijayashanti
ABN , First Publish Date - 2022-05-28T16:39:32+05:30 IST
నగరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాకతో తెలంగాణలో కాషాయ శకం ప్రారంభమైందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు.
హైదరాబాద్: నగరానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra modi) రాకతో తెలంగాణలో కాషాయ శకం ప్రారంభమైందని బీజేపీ నేత విజయశాంతి (Vijayashanti) అన్నారు. శనివారం ఫేస్బుక్ వేదికగా స్పందిస్తూ... ప్రధాని రాకతో తెలంగాణలో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని, కేసీఆర్(KCR) నియంతృత్వ పాలనపై ప్రధాని ధ్వజమెత్తారన్నారు. రాష్ట్రాభివృద్ధిని ఒక ఫ్యామిలీ అణచివేయాలని చూస్తోందన్నారని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో వేలాదిమంది అమరులయ్యారని... ఒక్క ఆశయం కోసం ఎందరో ప్రాణత్యాగాలు చేశారని, కానీ కేసీఆర్ నిరంకుశ పాలనలో ఎవరి ఆకాంక్షలు నెరవేరడం లేదని బీజేపీ నేత విమర్శించారు.
తెలంగాణకు విముక్తి కావాలని అన్నారు. కుటుంబ పాలనను, కుటుంబ పార్టీలను తరిమేస్తేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని మోదీ తెలంగాణ ప్రజలు స్పష్టం చేసినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కొత్త చరిత్ర రాస్తామని తేల్చి చెప్పారన్నారు. ప్రధాని వస్తున్నారంటేనే సీఎం కేసీఆర్కు వెన్నులో వణుకు పుడుతోందని... అందుకే కర్ణాటకకు పోయి దాక్కున్నారని రాములమ్మ దుయ్యబట్టారు.
కేసీఆర్కు ఏం పని ఉందని బెంగుళూర్ వెళ్లారని ప్రశ్నించారు. ‘‘సమస్యలు ఉంటే మోదీని సీఎం నేరుగా కలిసి చెప్పుకోవచ్చు కదా... అది చెయ్యరు. ప్రతిదానికి కేంద్రంపైన, ప్రధానిపై ఆరోపణలు చేయడం తప్ప... ఇంకేదీ చేత కాదు’’ అని మండిపడ్డారు. తెలంగాణలో పార్టీ కోసం కార్యకర్తలు పోరాడుతున్న తీరును మోదీ ప్రస్తావించడంతో కాషాయదళంలో కొత్త కళ కనిపించిందన్నారు. ఇదే ఉత్సహంతో కేసీఆర్ను గద్దె దించి కాషాయ జెండాను ఎగురేస్తామని విజయశాంతి ధీమా వ్యక్తం చేశారు.