హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ కొలువుల భర్తీ... ప్రాణం లేని మనిషిని బతికించడం... రెండూ ఒకటే అని జనానికి బాగా అర్థమైందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. 50 వేల కొలువుల భర్తీ అంటూ నెలలకు నెలలు గడిపేస్తున్నారని, వాటిని భర్తీ చేసి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చే ఆలోచన ఈ సర్కారుకు లేనే లేదని ఆమె వ్యాఖ్యానించారు. మొత్తం లెక్కలు సక్రమంగా తీస్తే దాదాపు లక్షకు పైగా ప్రభుత్వ కొలువులు ఖాళీగా ఉంటాయని పలు వర్గాలు పేర్కొంటున్నాయని విజయశాంతి తెలిపారు.
‘‘ఎలాగో కిందా మీదా పడి సుమారు 65 వేల ఖాళీలు ఉన్నట్లు ఆర్థిక శాఖ తేల్చి చెప్పినా.... లెక్కలు అసమగ్రంగా ఉన్నాయని నివేదికల్ని పక్కన పడేశారు తప్ప, అధికార యంత్రాంగంతో సరైన లెక్కలు తీసి నిరుద్యోగులకు న్యాయం చెయ్యాలనే ఆలోచన లేని దుస్థితి కనిపిస్తోంది. గతంలో కమల్ నాథన్ కమిషన్ పేరు చెబుతూ ఉద్యోగాల భర్తీకి కాలయాపన చేసిన ఈ సర్కారు... ఇప్పుడు ఖాళీలపై సరైన వివరాల్లేవంటూ కాలం గడిపేస్తోంది. కనీసం సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించిన ఆ 50 వేల ఉద్యోగాల భర్తీకి కూడా ముందడుగు వెయ్యలేని ఈ సర్కారు చేతగానితనం చూసి యావత్ తెలంగాణ సిగ్గుపడుతోంది. గతేడాది డిసెంబర్లో కేసీఆర్ ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా ఆయన మాట మీద నమ్మకం లేక పలువురు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఉద్యోగాల సంగతి అటుంచి, నిరుద్యోగ భృతి అన్నారు. చివరికి ఈ హామీని కూడా తుంగలోకి తొక్కేశారు. ఈ సర్కారు అసమర్థత కారణంగా చాలామంది నిరుద్యోగులకు ఏజ్ బార్ అయిపోయి ఎన్నో పోస్టులకు అన్యాయంగా అనర్హులయ్యారు. ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనో.... ఎక్కడైనా ఎన్నికల మాట వినిపిస్తే తప్ప మళ్ళీ కేసీఆర్ నోట ఉద్యోగాల మాట వినిపించదేమో.’’ అని విజయశాంతి ఎద్దేవా చేశారు.