2009 నుంచి కేసీఆర్.. నాటకాలు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-05-26T00:51:05+05:30 IST

ప్రజలను మోసగించడానికే సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో..

2009 నుంచి కేసీఆర్.. నాటకాలు: విజయశాంతి

హైదరాబాద్: ప్రజలను మోసగించడానికే సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో మాట తప్పడం, మోసగించడం తప్ప.. కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు. రైతులు, నిరుద్యోగులను గాలికొదిలేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తిరుగుతున్నాడని ధ్వజమెత్తారు. సోషల్ మీడియా వేదికగా విజయశాంతి పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే..


‘‘ఫెడరల్ ఫ్రంట్ అంటూ జాతీయ రాజకీయాల పేరిట తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే... ప్రజల్ని మోసగించడానికి ఆయన ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారని పదే పదే స్పష్టమవుతోంది. సారు నాటకాల్ని 2009 నుంచీ జనం చూస్తూనే ఉన్నారు. నాటి ఎన్నికల్లో తొలుత టీడీపీ, సిపిఐలతో కూడిన మహాకూటమికి జై కొట్టిన కేసీఆర్.... బ్యాలెట్ బాక్సులు తెరవకముందే పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన భారీ ర్యాలీలో ఎన్టీయేకి సై అన్నారు. తర్వాత 2014లో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్ జపం చేసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేస్తానంటూ వారిని ఊరించి చివరికి ఝలక్ ఇచ్చారు.


‘‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి, తాను సీఎం అయ్యాక కూడా తనకు అలవాటైన కప్పదాటుడు వ్యవహారాలు... ఇచ్చిన మాట తప్పడం, చేసిన వాగ్దానాలు మర్చిపోవడం వంటి చర్యలతో గత ఏడేళ్ళ పైచిలుకు పాలనాకాలంలో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారు. తెలంగాణలో రైతులు - నిరుద్యోగుల ఆత్మహత్యలు, బీజేపీ విజయాల నేపథ్యంలో పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయిన కేసీఆర్ గారికి... కమలదళం తన పాలనకు చరమగీతం పాడుతుందనే భయం పట్టుకుంది. రాష్ట్రంలో ఉంటే ఎక్కడకు వెళ్లినా జనం నిలదీస్తారనే ఆందోళనతో జాతీయ రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రం బయట తిరగడం మొదలుపెట్టారు. తనను ఛీకొడుతున్న తెలంగాణ ప్రజల నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ సమ్మర్ వెకేషన్‌గా ఈ ఊళ్ళు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప మరొకటి కాదు.


‘‘దేశంలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జవాన్ల కుటుంబాలకి సాయం చెయ్యడాన్ని ఎవరూ తప్పుపట్టరు కానీ, కేసీఆర్ సీఎం అయ్యాక గత ఏడేళ్ళ కాలంలో ఒక్క తెలంగాణలోనే 7 వేలకు పైగా రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు... వీరందరినీ గాలికొదిలేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటూ తిరగడాన్ని ఎలా చూడాలి? గత ఏడేళ్ళలో దేశం మొత్తం మీద కూడా వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి మరణాలు ఎన్నో జరిగాయి... వారి కుటుంబాలనీ కేసీఆర్ అదుకుంటారా?  తనను ఎన్నుకున్న రాష్ట్రానికే న్యాయం చెయ్యలేని కేసీఆర్... జాతీయ రాజకీయాలంటూ దేశాన్ని కాపాడేదేమీ లేదని ఆయన కలుస్తున్న నేతలకు, ప్రజలకు బాగా తెలుసు’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.

Updated Date - 2022-05-26T00:51:05+05:30 IST