సీఎం కేసీఆర్ తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారో...: విజయశాంతి

ABN , First Publish Date - 2021-08-27T14:46:22+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు.

సీఎం కేసీఆర్ తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారో...: విజయశాంతి

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై బీజేపీ నేత విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘పీసీసీ అధ్యక్షులు, టీఆర్‌ఎస్ మంత్రిగారికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే.... ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆర్‌ఎస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అవసరం లేకుంటే కేసీఆర్ గారు ప్రజల ముఖం కూడా చూడరన్న బలమైన నమ్మకం తెలంగాణ సమాజంలో ఏర్పడి ఉండటం ఇందుకు కారణం కావచ్చు. ఇంకా తెలంగాణలో ప్రజాప్రతినిధులను రాజీనామాలకై అనేక నియోజకవర్గాలలో ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజీనామాల కోసం, ఉపఎన్నికల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులకు ప్రజలను తీసుకెళ్ళిన ఈ అప్పుల, ఆస్తుల అమ్మకాల సీఎం గారు భవిష్యత్తులో తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారో అన్న ఆందోళన అందరిలోనూ ఏర్పడుతున్నది’’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.



Updated Date - 2021-08-27T14:46:22+05:30 IST