tarun chugh comments: బీజేపీ విజయం తథ్యం...
ABN , First Publish Date - 2022-08-17T17:51:36+05:30 IST
తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని బీజేపీ తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని బీజేపీ (BJP) తెలంగాణ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ (Tarun chug) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ (KCR)కు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. కేసీఆర్ (CM KCR) తన సొంత రాజ్యాంగం రచించాలని అనుకుంటున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ (Bandi sanjay) యాత్రపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని అన్నారు. సీఎం కేసీఆర్కు అధికారాన్ని కోల్పోతున్నాం అన్న భయం పట్టుకుందని తెలిపారు. బీజేపీ విజయం తథ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని... అందుకే కేసీఆర్ బీజేపీ అంటే భయపడుతున్నారని తెలిపారు. బండి సంజయ్ యాత్రపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు నిరాటకంగా జరిగేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
21న బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి...
కేంద్రమంత్రి అమిత్ షా ఈ నెల 21న తెలంగాణ లో పర్యటిస్తారని తెలిపారు. అదే రోజు అమిత్ షా మునుగోడులో సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. అదే సభలో రాజగోపాల్ రెడ్డి (Rajagopal reddy) బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఇంకా ఇతర పార్టీలకు చెందిన చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరనున్నారని ప్రకటించారు. ప్రధాని పంద్రాగస్టు ప్రసంగంలో పసలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను తరుణ్ చుగ్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ సాయంత్రం చేసే ప్రసంగాలపై ఎక్కువ స్పందించడం అనవసరమన్నారు.
బీజేపీలో చేరికలు ఉంటాయి....
మునుగోడులో ప్రజల ఆశీర్వాదం బీజేపీకే ఉంటుందన్నారు. తెలంగాణకు అవినీతి, వంశ పారపర్యంగా వచ్చే రాజకీయాలే శత్రువులని అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ పాపాల నుంచి త్వరలో విముక్తి లభిస్తుందన్నారు. ఆంగ్లేయులు, ఇందిరాగాంధీ లాగానే కేసీఆర్ పాలన ఉందని... త్వరలో ప్రజలు ముంగింపు పలుకుతారని తెలిపారు. రేపు 4 గంటలకు కోరుట్లలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని తరుణ్ చుగ్ ప్రకటించారు.