అబద్ధాలకోరు జగన్
ABN , First Publish Date - 2022-08-10T05:45:16+05:30 IST
ఒక్క అవకాశమంటూ అన్ని వర్గాల ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆరోపించారు.
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
అమలాపురం టౌన్, ఆగస్టు 9: ఒక్క అవకాశమంటూ అన్ని వర్గాల ప్రజలను నమ్మించి రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ ఆరోపించారు. నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను వంచించి మాటా, మడమ రెండూ తిప్పిన అబద్ధాల కోరు ఈ సీఎం అని విమర్శించారు. బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన యువ సంఘర్షణ యాత్ర మంగళవారం అమలాపురం గడియార స్తంభం సెంటరుకు చేరుకుంది. తొలుత మహాత్మాగాంధీ విగ్రహానికి సత్యకుమార్తో పాటు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు కర్రి చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో సత్యకుమార్ ప్రభుత్వ విధానాలను తీవ్రస్థాయిలో విమర్శించారు. ‘ఓ యువకుడు, ఓ వ్యాపారవేత్త ప్రజల దగ్గరకు వచ్చి రాష్ట్రంలో మార్పు తెస్తానని చెబితే జనం నమ్మి ఓట్లు వేశారు. రూ.73 కోట్ల వ్యాపారాన్ని వేల కోట్ల వ్యాపారంగా విస్తరించిన ఆ ముఖ్యమంత్రి పాలనలో ఆయన, ఆయన అనుచరులు మాత్రమే మరింత సంపన్నులయ్యారు’ అని అన్నారు. ప్రజల నోట్లో మట్టి కొట్టారని విమర్శించారు. 2.40 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి మూడున్నరేళ్ల పాలనలో ఏవిధమైన నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఏ ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఆరోపించారు. జగన్ కుటుంబంలోని వారికి మాత్రం రాజకీయ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. కరోనా కాలం నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.85 కోట్ల మందికి కేంద్రం ఉచితంగా బియ్యం అందించేందుకు రూ.3.40 లక్షల కోట్లు మంజూరు చేసినా మోదీ బియ్యం పంపిణీ చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్రంలో బియ్యం స్మగ్లింగ్ మాత్రం భారీగా జరుగుతోందని ఆరోపించారు. అనంతపురంలో ఓ దౌర్భాగ్యుడు చేసిన చెండాలపు పనిని కులాల మధ్య వివాదంగా మార్పుచేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని సత్యకుమార్ ఆరోపించారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడిని కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసిన ఘటన నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం కోనసీమలో అల్లర్లు సృష్టించిందని ఆరోపించారు. అమలాపురం అల్లర్లలో 337 మందిపై కేసులు నమోదుచేసి 247 మందిని అరెస్టు చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపించారని సత్యకుమార్ అన్నారు. అవినీతి ఘనులు, హత్యలు చేసినవారు చట్టసభలకు వెళుతుంటే అమాయకులైన యువకులను జైలుకు పంపించారని ధ్వజమెత్తారు. ఆయా కుటుంబాల తల్లిదండ్రులు, పిల్లలు పడుతున్న మానసిక వేదన ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మాని అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండు చేశారు. యాత్రలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మానేపల్లి అయ్యాజీవేమా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శ్రీమన్నారాయణ, యాత్ర జోన్ కో-ఆర్టినేటర్ నల్లా పవన్కుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు యాళ్ల దొరబాబు, మోకా వెంకటసుబ్బారావు, ఆర్వీ నాయుడు, పాలూరి సత్యానందం, కె.హరీష్బాబు, కె.సత్యనారాయణరాజు, కటికిరెడ్డి గంగాధర్, పాలూరి జయప్రకాష్నారాయణ, అడబాల సత్యనారాయణ, దూరి రాజేష్ పాల్గొన్నారు.