‘Kashmir files లాగా త్వరలో హైదరాబాద్ ఫైల్స్..’
ABN , First Publish Date - 2022-03-21T18:27:41+05:30 IST
‘Kashmir files లాగా త్వరలో హైదరాబాద్ ఫైల్స్..’
- తెలంగాణ ఇండియాలో ఉందా?..
- పాకిస్థాన్లో ఉందా?
హైదరాబాద్: ‘కాశ్మీర్ ఫైల్స్’లాగా త్వరలోనే ‘హైదరాబాద్ ఫైల్స్’ కూడా వస్తుందని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం టెర్రర్ కారిడార్ను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు. నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని మురళీ మండిపడ్డారు. దీనికి టీఆర్ఎస్, పోలీసులు సహకరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్, ఆదిలాబాద్లో లవ్ జిహాద్ కేసులలో పురోగతి లేదన్నారు. బోధన్లో హిందులను అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా? లేదా పాకిస్థాన్లో ఉందా?.. అంటూ ఈ సందర్భంగా బీజేపీ నేత ప్రశ్నించారు.
హిందువుల సంఖ్య ఎందుకు తగ్గింది..!?
టీఆర్ఎస్, ఎంఐఎం కలిసిపోయి కుట్రలు చేస్తున్నాయన్నారు. మొన్న నిర్మల్.. నిన్న భైంసా.. నేడు బోధన్ వరకు ఉగ్రవాదుల కారిడార్గా మారుస్తున్నారని విమర్శించారు. మతోన్మాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. హిందువుల ప్రాణాల, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ ఆలీ రోహింగ్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి హిందులు వలసలు ఎందుకు జరిగాయని నిలదీశారు. 1970 తర్వాత ఎందుకు హిందువుల సంఖ్య తగ్గిందో తెలియాలన్నారు.