40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు: కన్నా

ABN , First Publish Date - 2021-01-21T17:37:14+05:30 IST

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నానని... అందుకు నిదర్శనమే గృహ నిర్బంధాలు అని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు: కన్నా

గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్నానని... అందుకు నిదర్శనమే గృహ నిర్బంధాలు అని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఏడాదిన్నర కాలంగా రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దాడులు ఎందుకు జరుగుతున్నాయో ప్రభుత్వం చెప్పలేని పరిస్థితి అని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేదని ఆయన చెప్పారు. ఏపీలో పోలీసు వ్యవస్థ చాలా ఆదర్శనీయంగా ఉండేదని, కానీ వైసీపీ నేతలు  చెప్పినట్లు నడుచుకోవాలనటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రభుత్వ చేతకానితనానికి మంత్రులు దూషణలే నిదర్శనమన్నారు. సంక్షేమ పథకాలు, డబ్బులు పంచి మళ్లీ ఎన్నికల్లో గెలవొచ్చని భావిస్తున్నారని, ఇవేవీ వారి సొంత డబ్బులు కావని వ్యాఖ్యానించారు. నిజమైన ఫ్యాక్షనిస్ట్ ఎలా ఉంటారో ఇప్పడు చూస్తున్నామన్నారు. విగ్రహాల ధ్వంసానికి కారకులు ఎవరో ప్రభుత్వం వారంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి సమర్ధత ఉంటే అసలు దోషులు ఎవరో చెప్పాలన్నారు. తప్పించుకునేందుకే బీజేపీ పార్టీపై నేపం వేస్తే  సరిపోదని తెలిపారు. ప్రభుత్వ అండదండలతోనే విగ్రహాల ధ్వంసం జరుగుతోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. 

Updated Date - 2021-01-21T17:37:14+05:30 IST