Minister Harish.. CM సీటుకే ఎసరు పెట్టాడు : ఈటల
ABN , First Publish Date - 2021-09-02T18:30:07+05:30 IST
మంత్రి హరీష్ రావుపై బీజేపీ నేత ఈటెల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీష్ రావుకు మతి భ్రమించిందన్నారు.
కరీంనగర్ : హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. మరీ ముఖ్యంగా మంత్రి హరీష్ రావు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్య రోజూ సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయ్. ఇప్పటికే ఒకరిపై ఒకరు పలుమార్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకోగా తాజాగా ఈటల మరోసారి దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుకు మతి భ్రమించిందని ఈటల వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన.. ‘ హరీష్..నీ చరిత్ర బయటపెడతా.. నా మీద చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధం... హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రా.. అన్ని ఏర్పాట్లు నేనే చేస్తా’’ అంటూ ఈటల సవాల్ విసిరారు.
తీవ్ర విమర్శలు...
‘హరీష్ రావు ఏమైనా తోపు, తురుముఖాన్ ఆ..? హరీష్ రావు ఒక నీచుడు.. ఆయన నిర్వాకంపై ప్రజలు ఉమ్మేస్తున్నారు. బిడ్డా హరీష్.. హుజురాబాద్లో నువ్వు నడిచే రోడ్లు ఎవరు వేశారు? నీకు కేసీఆర్ మంత్రి ఇవ్వను అన్నది నిజం కాదా..? హరీష్ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడు. సీఎం పోటీకి వస్తున్నా.. అని నన్ను తొలగించారా..? లేక భూముల కబ్జా చేశాడనా..?. మర్యాదగా చెప్తున్నా.. పోలీసు దండును వెంటనే ఆపాలి’ అని మంత్రి హరీష్ను ఈటెల హెచ్చరించారు.