టీఆర్‌ఎస్ పతనం ప్రారంభం: DK Aruna

ABN , First Publish Date - 2021-11-02T17:55:24+05:30 IST

హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోందని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు.

టీఆర్‌ఎస్ పతనం ప్రారంభం: DK Aruna

హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతి రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోందని ఆ పార్టీ నేత డీకే అరుణ అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని... అందుకు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని తెలిపారు. ఆత్మగౌరవం విజయం సాధించిందన్నారు. దళితబంధు పథకం లాంచ్ చేసిన గ్రామంలో బీజేపీ ముందంజలో ఉందని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని టీఆర్‌ఎస్ కోల్పోయిందని డీకే అన్నారు. ప్రజల నమ్మకాన్ని కేసీఆర్ కుటుంబం కోల్పోయిందన్నారు. వేలకోట్ల పథకాలకు జీఓలు ఇచ్చినా ప్రజలు నమ్మలేదని తెలిపారు. 6 వేల నుంచి 10 వేలు పెట్టి ఓట్లు కొన్నా లాభం లేకుండా పోయిందని విమర్శించారు.


‘‘డబ్బులు పంచి ఓట్లు కొనాలని అనుకున్నా... హుజూరాబాద్ ప్రజలు ఆత్మగౌరవం వైపే నిలబడ్డారని... హుజురాబాద్ ప్రజలకు నా సెల్యూట్’’ అని అన్నారు. అధికార యంత్రాంగాన్ని అంతా కూడా రంగంలోకి దింపినా ఫలితం లేదన్నారు. హుజూరాబాద్ ప్రజల తీర్పు చారిత్రాత్మకమైందని చెప్పారు. హుజూరాబాద్ తీర్పు ఒక కనువిప్పన్నారు. అభ్యర్థి ఎవరో తెలియనట్లుగా కేసీఆర్ రంగంలోకి దిగారని... కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడించారని అన్నారు. తెలంగాణ మొత్తం హుజూరాబాద్ తీర్పును కోరుకుంటోందన్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు. 

Updated Date - 2021-11-02T17:55:24+05:30 IST