BJP సంపన్నులకు అనుకూలం...Karnataka మాజీ సీఎం కుమారస్వామి విమర్శలు
ABN , First Publish Date - 2022-07-12T18:33:36+05:30 IST
బీజేపీ సర్కారుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు....
బెంగళూరు: బీజేపీ సర్కారుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధనవంతులకు అనుకూలమని, అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) శాసనసభా పక్ష నేత హెచ్డీ కుమారస్వామి విమర్శించారు.‘‘బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల పన్ను సొమ్మును దోచుకుంటోంది. నేను ఎలాంటి దోపిడీ సంస్థలను నడపడం లేదు. ఈ పార్టీలు మీ కోసం మరో శ్రీలంకను సృష్టిస్తాయి. కాబట్టి మీకు అలాంటి పార్టీలు కావాలో మీరే నిర్ణయించుకోండి’’ అని కుమారస్వామి అన్నారు.పేదలను వేధిస్తే శ్రీలంక తరహాలో ఇక్కడ కూడా స్పందన వస్తుందని మాజీ సీఎం హెచ్చరించారు.
దాసరహళ్లిలోని అబ్బిగెరె, హొసకెరెహళ్లిలో జరిగిన జనతా మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో జేడీఎస్కు ఆధారం లేదని కొందరు అంటున్నారని, నగరంలో మా పార్టీకి పునాది ఉందో లేదో చూపిస్తామని కుమారస్వామి అన్నారు. ‘‘మీరు బీజేపీని నమ్మొద్దు.. ప్రధాని మోదీ మాటలకు మోసపోవద్దు.. మోదీ, బీజేపీ పార్టీ ధనికుల కోసం.. ఎన్నికల్లో డబ్బులు చెల్లించి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారు.. మీ డబ్బును దోచుకుతింటూ సరదాగా గడుపుతున్నారు’’ అని కుమారస్వామి అన్నారు. ‘‘పీఎస్ఐ పోస్టు రావాలంటే లక్షల్లో డబ్బు ఖర్చయింది.. ఎక్కడ చూసినా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ’’ అని పీఎస్ఐ రిక్రూట్మెంట్ స్కామ్పై మాజీ సీఎం వ్యాఖ్యానించారు.