బగ్గా అరెస్టు వ్యవహారం.. బీజేపీకి సిద్ధూ అనూహ్య మద్దతు

ABN , First Publish Date - 2022-05-07T00:01:17+05:30 IST

బీజేపీ నేత తజిందర్ బగ్గాను శుక్రవారం ఉదయం ఢిల్లీలో అరెస్టు చేయడంపై పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్

బగ్గా అరెస్టు వ్యవహారం.. బీజేపీకి సిద్ధూ అనూహ్య మద్దతు

న్యూఢిల్లీ: బీజేపీ నేత తజిందర్ బగ్గాను శుక్రవారం ఉదయం ఢిల్లీలో అరెస్టు చేయడంపై పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూ స్పందించారు. అనూహ్యంగా ఆయన బీజేపీ వాదనకు బలం చేకూర్చే విధంగా వ్యాఖ్యానించారు. బగ్గా అరెస్టును ''రాజకీయ ప్రతీకార చర్య''గా సిద్ధూ అభివర్ణించారు. ఇందుకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌, ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన తప్పుపట్టారు.


''తజిందర్ బగ్గా వేరే పార్టీకి చెందిన వ్యక్తి. ప్రతి ఒక్కరికీ సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు. అయితే, వ్యక్తిగత విభేదాల పరిష్కారానికి పంజాబ్ పోలీసులను ఉపయోగించుకుని అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్‌లు ప్రతీకార రాజకీయాలకు పాల్పడటం చాలా పాపం. ఈ విషయాన్ని రాజకీయం చేయడం ద్వారా పంజాబ్ పోలీసుల ప్రతిష్టను దిగజార్చడం ఆపండి'' అని సిద్ధూ ట్వీట్ చేశారు.



మొహిలిలో గత నెలలో నమోదైన ఓ కేసుకు సంబంధించిన తజిందర్ పాల్ సింగ్ బగ్గాను ఢిల్లీలోని ఆయన నివాసంలో పంజాబ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అయితే బగ్గా వాహనాలను హర్యానాలోని కురుక్షేత్ర వద్ద ఆపేశారు. తమను ఎందుకు ఆపారని హర్యానా పోలీసులను పంజాబ్ పోలీసులు ప్రశ్నించగా, బగ్గాను బలవంతంగా అతని నివాసం నుంచి తీసుకెళ్తున్నట్టు తమకు సమాచారం వచ్చినట్టు వారు చెప్పారు. కాగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరుకావాలని ఐదు నోటీసులు ఇచ్చినప్పటికీ, ఆయన హాజరుకాకపోవడంతో ఈ చర్య తీసుకున్నట్టు పంజాబ్ పోలీసులు అంటున్నారు.


Read more