బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ
ABN , First Publish Date - 2020-09-27T06:06:25+05:30 IST
మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చారు. 2019లో బీజేపీలో...
నియామకం ప్రకటించిన జేపీనడ్డా
మహబూబ్నగర్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మాజీ మంత్రి డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు శనివారం ఉత్తర్వులిచ్చారు. 2019లో బీజేపీలో చేరిన ఆమె గడిచిన లోక్సభ ఎన్నికల్లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. గద్వాల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డీకే అరుణ, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా కొనసాగారు. కీలకమైన సమాచార, ప్రసార శాఖల మంత్రిగానూ వ్యవహరించారు.
అంతకు మునుపు ఒక పర్యాయం మహబూబ్నగర్ ఎంపీగానూ పోటీ చేసి ఓడిపోయారు. తొలుత 1996లో జడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనుచరగణం కలిగిన డీకే అరుణకు బీజేపీలో జాతీయ స్థాయిలో కీలక పదవి ఇవ్వడం ద్వారా ఆమె మరింత చురుగ్గా పని చేసే అవకాశం ఏర్పడిందని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నారు. డీకేఅరుణకు జాతీయస్థాయి పదవి రావడం పట్ల నాయకులు పడాకుల బాలరాజు, సురేందర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.