పెళ్లి కొడుకు లేకుండా ఊరేగింపు సాగుతోంది: బీజేపీపై తేజస్వీ సెటైర్లు

ABN , First Publish Date - 2021-03-03T16:19:01+05:30 IST

భారతీయ జనతా పార్టీపై తేజస్వీ స్పందిస్తూ ‘‘బీజేపీవాళ్లు బరాత్ (ఊరేగింపు) పెట్టారు. బెంగాల్‌లోని బీజేపీ నిర్వహిస్తున్న బరాత్‌కు కేంద్రమంత్రులంతా వరుస కట్టారు. కానీ ఈ బరాత్‌లో పెళ్లికొడుకు ఎవరంటే

పెళ్లి కొడుకు లేకుండా ఊరేగింపు సాగుతోంది: బీజేపీపై తేజస్వీ సెటైర్లు

కోల్‌కతా: ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని ఓడించడమే తమ లక్ష్యమని అన్న రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్.. బెంగాల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెళ్లి కొడుకు లేకుండానే బీజేపీ బరాత్ నిర్వహిస్తోందని, దానికి కేంద్రమంత్రులంతా వరుస కట్టి బరాత్‌లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు. మార్చి 1న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీతో సమావేశం అనంతరం వచ్చే ఎన్నికల్లో టీఎంసీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.


ఈ విషయమై బుధవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ఏ మతతత్వ పార్టీనైనా సరే పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే మా ప్రధాన్య అంశం. ఇందుకోసం మమతా బెనర్జీకి బేషరతు మద్దతు ఇస్తున్నాం. ఇది కేవలం నేను చెబుతున్న మాట కాదు. మమతాకు పూర్తి మద్దతు ఇవ్వడమన్నది లాలూ ప్రసాద్ యాదవ్ నిర్ణయం. బీజేపీని బెంగాల్‌లో అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పని చేస్తాం. ఇందుకోసం మమతా బెనర్జీ ఏ పని చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అని తేజస్వీ అన్నారు.


భారతీయ జనతా పార్టీపై తేజస్వీ స్పందిస్తూ ‘‘బీజేపీవాళ్లు బరాత్ (ఊరేగింపు) పెట్టారు. బెంగాల్‌లోని బీజేపీ నిర్వహిస్తున్న బరాత్‌కు కేంద్రమంత్రులంతా వరుస కట్టారు. కానీ ఈ బరాత్‌లో పెళ్లికొడుకు ఎవరంటే వారి దగ్గర సమాధానం లేదు. పెళ్లి కొడుకు లేకుండానే ఈ బరాత్ జరుగుతోంది. బెంగాల్‌లో మమతా బెనర్జీని మించిన అనుభవం ఎవరికి ఉంది? మమతా కంటే బెంగాల్‌ను ఎవరూ సమర్ధంగా పాలించలేరు’’ అని అన్నారు.

Updated Date - 2021-03-03T16:19:01+05:30 IST