బడ్జెట్ సమావేశాలకు హాజరు తప్పనిసరి.. పార్టీ ఎంపీలకు బీజేపీ ఆదేశం

ABN , First Publish Date - 2021-01-16T00:47:31+05:30 IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లోక్‌సభ..

బడ్జెట్ సమావేశాలకు హాజరు తప్పనిసరి.. పార్టీ ఎంపీలకు బీజేపీ ఆదేశం

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు తప్పనిసరిగా సమావేశాలకు హాజరుకావాలని ఆదేశించింది. కీలకమైన లెజిస్లేటివ్ వర్క్‌ను సభ ముందుకు తీసుకువస్తున్నందున పార్టీ ఎంపీలంతా సమావేశాలు ముగిసేంత వరకూ సభకు హాజరుకావాలని పేర్కొంది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం ఈ మేరకు పార్టీ ఎంపీలందరికీ లేఖ రాశారు. సమావేశాల్లో కీలకపైన అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని కూడా లేఖలో ఆయన పేర్కొన్నారు.


'పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంతో పాటు, బడ్జెట్ సమర్పణ, ప్రభుత్వం సభ ముందుకు తీసుకువచ్చే లెజిస్లేటివ్ వర్క్, ఇతర కీలక అంశాలపై చర్చ వంటివి ఉంటాయి. ఆ కారణంగా సమావేశాలు ముగిసేంత వరకూ మీ (ఎంపీలు) హాజరు తప్పనిసరి' అని లేఖలో పేర్కొన్నారు. సమావేశాలు ముగిసేంత వరకూ ఢిల్లీ వెలుపల పార్టీ ఎంపీలు ఎలాంటి కార్యక్రమాలను పెట్టుకోవద్దని కూడా ఆ లేఖలో సూచించారు.


పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగంతో ఈనెల 29న ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమర్పణ ఉంటుంది. ఏప్రిల్ 8తో సమావేశాలు ముగుస్తాయి. మధ్యలో ఫిబ్రవరి 15 నుంచి మార్చి 8 వరకూ రీసెస్ (విరామం) ఉంటుంది. వర్షాకాల సమావేశాల తరహాలోనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనూ కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించనున్నారు.

Updated Date - 2021-01-16T00:47:31+05:30 IST