గెలిచేది మేమే: బీజేపీ

ABN , First Publish Date - 2021-02-23T21:15:02+05:30 IST

కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ సినీయర్ నేత ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..

గెలిచేది మేమే: బీజేపీ

కొచ్చి: కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై కేంద్ర మంత్రి, బీజేపీ సినీయర్ నేత ప్రహ్లాద్ జోషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్ గాంధీ, లెఫ్ట్ పార్టీలు కపట రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీలు మిత్ర పక్షాలుగా ఉన్నాయని, కానీ కేరళలో మాత్రం ఇవి ప్రత్యర్థి పార్టీలుగా పోటీపడుతున్నాయని  విమర్శించారు. కేరళలో కుస్తీ, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో దోస్తీ.. ఇదెక్కడి రాజకీయమని ఆయన మండిపడ్డారు.


రాహుల్ గాంధీని తాను ఒకటే అడగాలనుకుంటున్నానని, ఆయన ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తారో, కపట విధానాలను పాటిస్తారో తేల్చి చెప్పాలని నిలదీశారు. రాజకీయం అంటే అధికారం చేజిక్కించుకోవడం కాదని, దానికోసం ఇక్కడ ఓ పార్టీతో అంటకాగడం, అక్కడ మరో పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఎంత మాత్రం సరి కాదని, ఇప్పటికైనా వేరు వేరు రాష్ట్రాల్లో వేరు వేరు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కలిగి ఉండడంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఢిల్లీలో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతారని, కానీ బెంగాల్ విషయంలో మాత్రం ఆమె కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తారని, ఇదెక్కడి విడ్డూరమని ఎద్దేవా చేశారు. అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా ఢిల్లీ, బెంగాల్‌, తమిళనాడుల్లో కాంగ్రెస్‌కు మద్దతు పలుకుతాయి. కానీ కేరళలో మాత్రం వైరం ప్రదర్శిస్తుంటాయని విమర్శించారు.


రాహుల్ గాంధీ ట్రాక్టర్‌పై యాక్టర్‌లా ఉన్నారని, ఆయన రైతులకు, ఏపీఎంసీ(అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ)లకు మద్దతుగా ఉంటే మరి కేరళలో ఏపీఎంసీలు ఎందుకు లేవని, దీనిపై రాహుల్ ఎందుకని నోరు మెదపరని ప్రశ్నించారు. అలాగే పంజాబ్‌లో అధికార కాంగ్రెస్ ఓ చట్టం తీసుకొచ్చిందని, దానిని రైతులు అతిక్రమిస్తే వారికి జైలుకు పంపించేందుకు కూడా అవకాశం ఉందని, వీటిపై రాహుల్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు. 


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధిస్తుందని, పుదుచ్చేరిలో తిరిగి ప్రభుత్వాన్ని నెలకొల్పుతుందని జోస్యం చెప్పారు. ఇక కేరళలో కూడా ప్రస్తుతం బీజేపీ అనుకూల పవనాలు మొదలయ్యాయని, అతి త్వరలో అనేక మార్పులు చవిచూస్తారని హెచ్చరించారు.

Updated Date - 2021-02-23T21:15:02+05:30 IST