అస్సాంలోని ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ, మిత్రపక్షాలు.. మోదీ చలవేనన్న సీఎం

ABN , First Publish Date - 2021-11-03T02:30:53+05:30 IST

దేశంలోని 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల ఘోర పరాజయాలు చవిచూసిన

అస్సాంలోని ఐదు స్థానాలను గెలుచుకున్న బీజేపీ, మిత్రపక్షాలు.. మోదీ చలవేనన్న సీఎం

దిస్పూర్: దేశంలోని 3 లోక్‌సభ, 29 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో పలుచోట్ల ఘోర పరాజయాలు చవిచూసిన బీజేపీ అస్సాంలో మాత్రం తిరుగులేని విజయం సాధించింది. ఉప ఎన్నికలు జరిగిన ఐదు చోట్లా బీజేపీ, దాని మిత్ర పక్షాలు విజయం సాధించాయి. బీజేపీ మూడు చోట్ల, మిత్రపక్షమైన యూపీపీఎల్ రెండు చోట్ల పోటీ చేయగా అన్ని స్థానాలను కైవసం చేసుకున్నాయి.


భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఫణీందర్ తాలూక్‌దార్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి శైలేంద్రనాథ్ దాస్‌పై 25,031 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తోవ్రాలో బీజేపీ అభ్యర్థి సుశాంత బోర్గో‌హెయిన్ తన సమీప రాయిజోర్‌దళ్ అభ్యర్థిపై  30,561 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరియాని అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి రూప్‌జ్యోతి కురి కాంగ్రెస్ అభ్యర్థి లుహిట్ కొన్వర్‌పై  40,104 ఓట్ల తేడాతో విజయం సాధించారు.  గోసాయ్‌గావ్, తమూల్‌పూర్ స్థానాల్లో యూపీపీఎల్ అభ్యర్థులు జిరోన్ బసుముతారీ, జిలోన్ డైమరీ జయకేతనం ఎగురవేశారు. 


ఉప ఎన్నికల్లో బీజేపీ, మిత్రపక్షాల గెలుపుపై స్పందించిన ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ గెలుపు అద్దం పడుతోందన్నారు. అస్సాంను మరింత గొప్పగా తీర్చిదిద్దేందుకు మోదీ కంకణం కట్టుకున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-11-03T02:30:53+05:30 IST