బీజేపీ కార్యకర్త ఇంటిపై దాడి.. అతడి తల్లిని దారుణంగా..
ABN , First Publish Date - 2021-03-01T20:27:55+05:30 IST
తమ పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. అతది ఇంట్లోకి దూరి అతడితో పాటు అతడి తల్లిని తీవ్రంగా గాయపరిచారని బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే..
కలకత్తా: తమ పార్టీకి చెందిన ఓ కార్యకర్తపై తృణమూల్ కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని బీజేపీ ఆరోపించింది. అతది ఇంట్లోకి దూరి అతడితో పాటు అతడి తల్లిని తీవ్రంగా గాయపరిచారని బెంగాల్ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఏజెన్సీతో బాధిత మహిళ మాట్లాడిన వీడియోను బీజేపీ తన ట్విటర్లో షేర్ చేసింది. దాడికి గురైన మహిళ ఆవేదనతో మాట్లాడుతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడవచ్చు. ‘వాళ్లు నా తలపై, మెడపై కొట్టారు. నా ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అంతేకాకుండా ఈ దాడి విషయం ఎక్కడినా చెబితే ఇతకంటే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. నేను చాలా భయపడ్డాను. శరీరం మొత్తం తీవ్రమైన నొప్పిగా ఉంది’ అంటూ ఆ వీడియోలోని మహిళ పేర్కొనడం గమనించవచ్చు.
వివరాల్లోకి వెళితే.. బెంగాల్లోని 24 పరగణాస్ ప్రాంతంలో బీజేపీ కార్యకర్త గోపాల్ మజుందార్.. తన తల్లి షోవా మజుందార్తో కలిసి నివశిస్తున్నాడు. అయితే ఆదివారం వారిపై కొంతమంది ఆగంతకులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అయితే దాడి చేసింది తృణమూల్ కాంగ్రెస్కు చెందినవారేనని బీజేపీ ఆరోపిస్తోంది. కానీ టీఎంసీ మాత్రం.. ఈ దాడికి, తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. ఇదిలా ఉంటే మార్చి 27 నుంచి బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు మొత్తం 8 ఫేజ్లలో జరగనున్నాయి. ఎన్నికల ముందు బీజేపీ కార్యకర్తలపై ఇలాంటి దాడి జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.