తమిళనాడులో రాబోయేది బీజేపీ-ఏఐఏడీఎంకే ప్రభుత్వమే : అమిత్ షా
ABN , First Publish Date - 2021-03-07T22:26:23+05:30 IST
తమిళనాడులో రాబోయేది బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి ప్రభుత్వమేనని
మధురై : తమిళనాడులో రాబోయేది బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమి ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 6న జరిగే శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమికి గట్టి మద్దతు ఇవ్వబోతున్నారన్నారు. ఈ కూటమి గెలుపు కోసం ఆదివారం ఆయన కన్యాకుమారి జిల్లాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అమిత్ షా ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానికులతో మాట్లాడారు. వారికి బీజేపీ ఎన్నికల ప్రచార కరపత్రాలను అందజేశారు.
కన్యా కుమారి లోక్సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోన్ రాధాకృష్ణన్ పోటీ చేస్తారు. అమిత్ షాతోపాటు పోన్ రాధాకృష్ణన్ కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. రాధాకృష్ణన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా ప్రజలను కోరారు. ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ఇక్కడి నుంచి బీజేపీ లోక్సభ సభ్యుడిని పంపించడం చాలా ముఖ్యమని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో బీజేపీ-ఏఐఏడీఎంకే కూటమిని భారీ ఆధిక్యంతో గెలిపించాలని కోరారు. అంతకుముందు ఆయన సుచీంద్రంలోని శ్రీ తనుమలయన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తమిళనాడు శాసన సభలో 234 స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 6న శాసన సభ ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 2న జరుగుతుంది.