బిట్కాయిన్ స్కామ్ చాలా పెద్దది: రాహుల్ గాంధీ
ABN , First Publish Date - 2021-11-14T00:09:17+05:30 IST
అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి అధికారులు రూ.9 కోట్ల విలువైన బిట్ కాయిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ వైబ్సైట్లను శ్రీకృష్ణ హ్యాక్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి...
న్యూఢిల్లీ: కర్ణాటకను కుదిపివేస్తున్న బిట్కాయిన్ స్కామ్పై తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. బిట్కాయిన్ స్కామ్ చాలా పెద్దదని, అతిపెద్ద గూడుపుటానీని బిట్కాయిన్ చాలా వరకు కప్పి ఉంచిందని అన్నారు. శనివారం తన ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ.. పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, బీజేపీలను టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారని నెటిజెన్లు అంటున్నారు.
‘‘బిట్కాయిన్ స్కామ్ పెద్దది. చాలా పెద్ద గూడుపుటానీని ఇది కనిపించకుండా చేసింది. ఎందుకంటే కొందరి అహాన్ని కప్పిపుచ్చుకోవాలి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. ఈ కేసు విషయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన ఆరోపణలు చేశారు. శ్రీకృష్ణ అలియాస్ శ్రీ జన్ధన్ అకౌంట్లను హ్యాక్ చేసి మొత్తం 6 వేల కోట్ల రూపాయల స్కామ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ స్కామ్పై తన దగ్గర పక్కా ఆధారాలు లేకపోయినప్పటికీ ఈ విషయమై తనకు సమాచారం అందిందని, కేవలం జన్ ధన్ నుంచే ఈ సొమ్ము మళ్లిపోయిందని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
అభియోగాలు ఎదుర్కొంటున్న శ్రీకృష్ణ అలియాస్ శ్రీకి నుంచి అధికారులు రూ.9 కోట్ల విలువైన బిట్ కాయిన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ వైబ్సైట్లను శ్రీకృష్ణ హ్యాక్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఆయన బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపులు జరిపి డార్క్ నెట్ ద్వారా మత్తు పదార్థాలు విక్రయించాడని అభియోగం. ఈ స్కామ్లో బడా నేతలు, పొలిటీషియన్ల పిల్లలు సైతం ఇన్వాల్వ్ అయ్యారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న క్రమంలో.. ఈ స్కామ్ ప్రస్తుతం దేశవ్యాప్త చర్చకు దారితీసింది.