Bitcoin పేరుతో Hyderabad లో భారీ మోసం
ABN , First Publish Date - 2022-03-17T12:02:49+05:30 IST
Bitcoin పేరుతో Hyderabad లో భారీ మోసం
- రూ.కోటి వరకు టోకరా వేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ సిటీ/హిమాయత్నగర్ : బిట్కాయిన్లో పెట్టుబడులతో అత్యధిక లాభాలొస్తాయని స్నేహితుల ద్వారా విని ఆత్యాశకు పోయిన ఓ మహిళ కోటి రూపాయల వరకు నష్టపోయింది. సిటీ సైబర్క్రైమ్స్ ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్కు చెందిన ఓ మహిళకు ఆన్లైన్ ట్రేడింగ్ చేసే కొందరు మహిళలతో స్నేహం ఉంది. బిట్కాయిన్ తదితర క్రిప్టోకరెన్సీలలో పెట్టుబడుల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని వారి మాటల ద్వారా తెలుసుకుంది. సొంతంగా గూగుల్లో సెర్చ్ చేసి ఓ యాప్ ద్వారా పలు విడతలుగా మొత్తం రూ.90లక్షలతో బిట్కాయిన్స్ కొనుగోలు చేసింది. ఆ యాప్లో యూఎస్ డాలర్ల రూపంలో పెట్టుబడులకు అధిక మొత్తంలో లాభాలు వస్తున్నట్లు కనిపించింది.
ఇటీవల ఓ కేటుగాడు మహిళకు ఫోన్ చేసి తాను బిట్కాయిన్స్ ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నాడు. మీకు బిట్కాయిన్స్ పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాన్ని యూఎస్ డాలర్ల నుంచిఇండియన్ రూపాయల్లోకి మార్చి బ్యాంకు ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేస్తానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మిన మహిళ తన బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీల వివరాలు కూడా ఇచ్చేసింది. దీంతో కేటుగాడు మహిళ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును మొత్తం తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఆ తర్వాత కేటుగాడి ఫోన్ స్విచాఫ్ రావడంతో పాటు బ్యాంకు అకౌంట్ బ్యాలన్స్ ఖాళీ కావడంతో మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్క్రైమ్స్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.