మార్కెట్లో కొత్త బ్రెజ్జా
ABN , First Publish Date - 2022-07-01T09:14:14+05:30 IST
మార్కెట్లో కొత్త బ్రెజ్జా
ప్రారంభ ధర రూ.7.99 లక్షలు
న్యూఢిల్లీ: మారుతి సుజుకీ.. బ్రెజ్జా కొత్త వెర్షన్ కారును మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ప్రారంభ రూ.7.99 లక్షలు (ఎక్స్షోరూమ్).కొత్త బ్రెజ్జాతో ఎస్యూవీ విభాగంలో తాము మరింత పటిష్ఠం అవుతామని కంపెనీ తెలిపింది. ఈ రెండో తరం బ్రెజ్జా మార్కెట్లో టాటా నెక్సాన్, హ్యుండయ్ వెన్యూ, కియా సోనెట్తో పోటీ పడనుంది. కొత్త బ్రెజ్జా మాన్యువల్, ఆటోమేటిక్ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. గత 8 నెలల కాలంలో తాము విడుదల చేసిన ఆరో కారు ఇదని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ హిసాషి టకయుచి చెప్పారు. కొత్తతరం కే సీరీస్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్తో కూడిన ఈ కారు లీటరు పెట్రోల్కు 20.15 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. రెండు కొత్త వెర్షన్లలోనూ 6 స్పీడ్ ట్రాన్స్మిషన్, ఎలక్ర్టిక్ సన్రూఫ్, డిజిటల్ 360 కెమెరా, 40 కనెక్టెడ్ ఫీచర్లు, 6 ఎయిర్బ్యాగ్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ప్రత్యేకతలున్నాయి.