స్నేహితుడి ఇంటికి వెళుతూ తిరిగిరాని లోకాలకు
ABN , First Publish Date - 2021-01-27T05:47:59+05:30 IST
స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతూ కౌశిక్(14) అనే 9వ తరగతి విద్యార్థి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఇదే ఘటనలో ఓ ఎలక్ట్రిషీయన్ పొట్టకూటి కోసం వెళుతూ అశువులు బాశాడు.
ఎదురెదురుగా ఽఢీకొన్న రెండు ద్విచక్ర వాహనాలు
9వ తరగతి విద్యార్థి, ఎలక్ట్రీషియన్ దుర్మరణం
మరో విద్యార్థి పరిస్థితి విషమం
శ్రీకాళహస్తి అర్బన్, జనవరి 26: స్నేహితుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు వెళుతూ కౌశిక్(14) అనే 9వ తరగతి విద్యార్థి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఇదే ఘటనలో ఓ ఎలక్ట్రిషీయన్ పొట్టకూటి కోసం వెళుతూ అశువులు బాశాడు. శ్రీకాళహస్తి మండలంలోని ఏర్పేడు-వెంకటగిరి రహదారిలోని చెక్పోస్టు సమీపంలో మంగళవారం జరిగింది. శ్రీకాళహస్తి రూరల్ ఎస్ఐ ఈశ్వర్ తెలిపిన వివరాలు... నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణానికి చెందిన కౌశిక్, భార్గవ్, విష్ణు అదే పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. శ్రీకాళహస్తి మండలం వాంపల్లెకు చెందిన సంతోష్ కూడా అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం సంతోష్ పుట్టినరోజు కావడంతో స్నేహితులు వాంపల్లెకు వచ్చి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. భార్గవ్ బాబాయికి చెందిన ద్విచక్ర వాహనంపై ముగ్గురు విద్యార్థులు వెంకటగిరి నుంచి వాంపల్లెకు బయలుదేరారు. ఏర్పేడు మండలం బండివానిపల్లెకు చెందిన నాగేంద్రబాబు(24) ఎలక్ట్రీషియన్. ఏర్పేడు మండలం పల్లంపేట వద్ద దుకాణం నిర్వహిస్తుంటాడు. వెంకటగిరి సమీపంలో వ్యవసాయ మోటరు మరమ్మతులు చేసే నిమిత్తం ద్విచక్రవాహనంపై నాగేంద్రబాబు బయలుదేరాడు. ఈ క్రమంలో వాంపల్లె వద్ద విద్యార్థులు, నాగేంద్రబాబు వెళ్లుతున్న ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కౌశిక్, నాగేంద్రబాబు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇక భార్గవ్, విష్ణు కూడా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల క్షతగాత్రులను వెంకటగిరి పట్టణానికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కౌశిక్ తండ్రి ఆటోడ్రైవర్, తల్లి గృహిణి. వీరికి ఒకే కుమారుడు. ఒక్కగానొక్క కుమారుడు తిరిగిరాని లోకాలకు చేరుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక భార్గవ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎస్ఐ ఈశ్వర్ తెలిపారు.