బిల్లులు రాక ఇక్కట్లు
ABN , First Publish Date - 2022-01-20T04:57:51+05:30 IST
రాష్ట్రప్రభుత్వం పల్లే ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాల నిర్మాణాల పనులను చేపట్టింది.
రెండేళ్ల క్రితం పూర్తైన వైకుంఠధామ నిర్మాణాలు
అసంతృప్తి వ్యక్తంచేస్తున్న సర్పంచ్లు
నేడు సర్వ సభ్య సమావేశంలో నిలదీసే అవకాశం
కల్లూరు, జనవరి 19: రాష్ట్రప్రభుత్వం పల్లే ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైకుంఠధామాల నిర్మాణాల పనులను చేపట్టింది. వీటిని గ్రామ పంచాయతీల సర్పంచుల ఆధ్వర్యంలో రెండేళ్ల క్రితం వాటి నిర్మాణం పనులను చేపట్టారు. మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో పంచాయితీరాజ్ శాఖ తరుపున 23 పంచాయితీల్లో, ఉపాధి హామి పఽథకం ద్వారా 8 గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాల నిర్మాణం చేపట్టారు. అందులో పంచాయతీరాజ్ శాఖ తరుపున నిర్మించిన వైకుంఠధామాల నిర్మాణాలకు బిల్లులు రావాల్సి ఉంది. దీనికి సంబంధించి తుది దశలో పంచాయతీరాజ్ శాఖ తరుపున క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడ తనిఖీలు నిర్వహించారు. తదుపరి వారు సదరు పనుల నాణ్యతపై ఽద్రువీకరణ పత్రం పంచాయతీ శాఖ వారికి అందజేయాల్సి ఉంది. కాని ఇంత వరకు వాటిపై స్పష్టత రానందున ఇంత వరకు తమకు బిల్లులు అందలేదని మండలంలోని యజ్ఞనారయణపురం, హనుమాతండా, పుల్లయ్యబంజరు, లక్ష్మిపురం గ్రామాల సర్పంచులు రావి సూర్యనారయణ, ధరావత్ మోహన్నాయక్, పెద్దబోయిన కృష్ణవేణి, గుగులోతు లక్ష్మిలు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతో కూడ కొంత జాప్యం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. ఇంకాను ఉపాధి హామీ పథకం ద్వారా 2020లో గ్రామాల్లో చేపట్టిన సీసీ రహదారులకు సంబంధించి కూడ నిర్మాణం పనులు పూర్తైన ఇకాను బిల్లులు రావాల్సి ఉందని సర్పంచులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే తమ పదవికాలం మూడేళ్లుకు సమీపిస్తున్న ఇంత వరకు తాము చేపట్టిన పనులకు బిల్లులు అందక పోవటం శోచనీయమన్నారు. బిల్లులు అందని విషయమై గురువారం జరగనున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచులు ప్రధాన అంశంగా లేవనేత్తనున్నారని తెలిసింది. ఇప్పటికైన అధికారులు స్పందించి బకాయి బిల్లులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.