బైక్‌ల చోరీ ముఠా ఆటకట్టు

ABN , First Publish Date - 2020-08-11T10:05:52+05:30 IST

బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఆసి్‌ఫనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు

బైక్‌ల చోరీ ముఠా ఆటకట్టు

ముగ్గురి అరెస్టు.. 12 ద్విచక్రవాహనాలు స్వాధీనం


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): బైక్‌లు చోరీ చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను ఆసి్‌ఫనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 12 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆసి్‌ఫనగర్‌, మహబూబ్‌కాలనీ ప్రాంతానికి చెందిన ఎం.వెంకటేశ్‌(22) పెట్రోల్‌ బంక్‌లో లేబర్‌గా పనిచేస్తుంటాడు. కర్ణాటక, బీదర్‌ నివాసి వసీం అక్రం అలియాస్‌ వసీం (27) జిర్రాలో నివసిస్తూ మాంసం విక్రయించే వ్యాపారం చేస్తుంటాడు. కర్ణాటక, బీదర్‌ వాస్తవ్యుడు, టప్పాచబుత్రలో ఉంటున్న సిరాజ్‌ఖాన్‌(28) సలీం హోటల్‌లో టీ మేకర్‌గా పనిచేస్తున్నాడు. ముగ్గురూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. 


గ్యాంగ్‌ లీడర్‌ వెంకటేశ్‌ ద్విచక్ర వాహనాల చోరీలో దిట్ట. రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసి్‌ఫనగర్‌ పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. జూలై మొదటి వారంలో జైలు నుంచి విడుదలయ్యాడు. సులభంగా డబ్బు సంపాదించాలని మళ్లీ నేరాల బాటపట్టాడు. తన స్నేహితులైన వసీం అక్రం, సిరాజ్‌ఖాన్‌తో కలిసి బైక్‌లు చోరీ చేయడం ప్రారంభించాడు. నకిలీ తాళాలతో వెంకటేశ్‌ బైక్‌ తాళం తీయగా వసీం అక్రం, సిరాజ్‌ఖాన్‌ వాటిని తీసుకుని పారిపోయేవారు. చోరీ చేసిన వాహనాలను కర్ణాటకకు తరలించి విక్రయించేవారు.


మంగళ్‌హాట్‌ పీఎస్‌ పరిధిలో ఆరు, రాయదుర్గంలో ఒకటి, ఆసిఫ్‌నగర్‌లో మూడు, లంగర్‌హౌస్‌లో ఒకటి, టప్పాచబుత్ర పీఎస్‌ పరిధిలో ఒక బైక్‌ చోరీ చేశారు. బైక్‌ల చోరీపై ఫిర్యాదులు రావడంతో సీసీ ఫుటేజీలు, ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా పోలీసులు వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించి మిగతా ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. దేశంలోనే ఫొటో ఎన్‌హాన్స్‌మెంట్‌ సాఫ్ట్‌వేర్‌ను హైదరాబాద్‌ పోలీసులు వినియోగించి నిందితులను గుర్తిస్తున్నట్లు సీపీ అంజనీకుమార్‌ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌, రామకృష్ణ, విజేందర్‌, రాహుల్‌ను అభినందించారు. 

Updated Date - 2020-08-11T10:05:52+05:30 IST