ద్విచక్రవాహనంపై నుంచి పడి మహిళ మృతి
ABN , First Publish Date - 2021-01-27T04:43:55+05:30 IST
ద్విచక్రవాహనంపై నుంచి జారి కిందపడి ఓ మహిళ మృతి చెందింది.
మద్దిపాడు, జనవరి 26 : ద్విచక్రవాహనంపై నుంచి జారి కిందపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండలంలోని దొడ్డవరప్పాడు స్పిన్నింగ్మిల్ సమీపంలో మంగళవారం జరిగింది. దర్శి మండలం కొత్తపల్లికి చెందిన పాలేరు ఆదెమ్మ(50) అనారోగ్యానికి గురికావడంతో ఆమె తమ్ముడు ద్విచక్రవాహనంపై ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకువెళుతున్నాడు. దొడ్డవరప్పాడు స్పిన్నింగ్ మిల్లు సమీపం వద్దకు రాగానే ఆదెమ్మ ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనంపై నుంచి జారి రోడ్డుమీద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ ఫాతిమా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు.
గుండ్లకమ్మలో పడి యువకుడి మృతి
మద్దిపాడు, జనవరి 26 : మద్దిపాడు సమీపంలోని గుండ్లకమ్మనదిలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మద్దిపాడు గ్రామానికి చెందిన మల్లెల హరిబాబు(35) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు, బంధువుల విచారించినా ఆచూకీ దొరకలేదు. ఈక్రమంలో మంగళవారం ఉదయం హరిబాబు మృతదేహాన్ని గుండ్లకమ్మలో ఉండటాన్ని స్థానికులు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అలాగే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ ఫాతిమా మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.