బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
ABN , First Publish Date - 2022-07-02T05:30:00+05:30 IST
బైక్ చెట్టుకు ఢీకొని ఒకరి మృతి
శామీర్పేట, జూలై 2 : బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలైన ఘటన శుక్రవారం అర్ధరాత్రి అలియాబాద్ చౌరస్తా సమీపంలో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన అనిల్కుమార్, హమారలింగేశ్వర్ అనే యువకులిద్దరూ కొంతకాలంగా మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడ పరిధిలోని హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తూ, అక్కడే నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో అనిల్కుమార్కు చెందిన పల్సర్ బైక్పై హమారలింగేశ్వర్ను ఎక్కించుకొని మజీద్పూర్ నుంచి బయలుదేరి అలియాబాద్ వైపునకు వెళ్తున్నాడు. ఈక్రమంలో అలియాబాద్ చౌరస్తా సమీపంలోని హెచ్బీఎల్ కంపెనీ బస్టాప్ వద్ద గల మూలమలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నారు. దీంతో అనిల్కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. హమారలింగేశ్వర్ తలకు తీవ్రగాయాలుకావడంతో స్థానికులు వంటి మామిడి సమీపంలోని ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు.