నవ వధువు పడకగదిలో మద్యం సీసాల కోసం పోలీసుల వెతుకులాట.. షాక్తో సొమ్మసిల్లిన అత్త!
ABN , First Publish Date - 2021-12-18T22:49:59+05:30 IST
మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్లో ఓ కొత్త పెళ్లి కూతురి ఇంట్లో మద్యం సీసాల కోసం
పాట్నా: మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్లో ఓ కొత్త పెళ్లి కూతురి ఇంట్లో మద్యం సీసాల కోసం పోలీసులు వెతకడం తీవ్ర వివాదాస్పదమైంది. గురువారం రాత్రి హజీపూర్ నగరంలోని హత్సార్గంజ్ ప్రాంతంలో నివసించే షీలాదేవి ఇంటికి వచ్చిన పోలీసులు నేరుగా ఆమె కోడలు పూజా కుమారి పడకగదిలోకి వెళ్లి మద్యం సీసాల కోసం వెతికారు.
కొత్త పెళ్లి కూతురైన ఆమె ఐదు రోజుల క్రితమే అత్తగారింటికి వచ్చింది. తమ కోడలి గదిలో పోలీసులు మద్యం సీసాల కోసం వెతకడాన్ని చూసి అత్త షీలాదేవి షాక్తో కుప్పకూలారు.
తనిఖీల కోసం పోలీసులు వచ్చినప్పుడు పూజా కుమారి ఆమె గదిలోనే ఉన్నారు. వచ్చిన పోలీసుల్లో ఒక్కరంటే ఒక్క మహిళా సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. ఇంటిని మొత్తం గాలించిన పోలీసులు పూజాకుమారి గదిని క్షుణ్ణంగా వెతికారు. బెడ్, సూట్కేసులు, అల్మారాలు, డ్రాలు.. దేనినీ విడిచిపెట్టలేదు.
ఎందుకు వెతుకుతున్నారు? ఏం వెతుకుతున్నారని తాను ప్రశ్నిస్తే మౌనంగా ఉండాలని హెచ్చరించారని పూజా కుమారి తెలిపారు. ఆ తర్వాత బెడ్రూములో దాచిపెట్టిన మద్యం సీసాల కోసం వెతుకుతున్నామని చెప్పారని మీడియాతో మాట్లాడుతూ పూజ వివరించారు.
పోలీసులు రావడం, మద్యం సీసాల కోసం ఇల్లంతా గాలించడం చూసి పూజా కుమారి అత్త సొమ్మసిల్లి పడిపోయారు. తన అత్తయ్య షాక్తో పడిపోయి అపస్మారకస్థితిలో ఉన్నప్పటికీ పోలీసులు ఏమాత్రం మానవత్వం చూపలేదని, ఇంటిని గాలించడం ఆపలేదని పూజ పేర్కొన్నారు.
ఈ సోదాల తర్వాత బయట తలెత్తుకు తిరగలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటంబంలో ఎవరికీ మద్యం తాగే అలవాటు లేదని, అయినప్పటికీ ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు నిర్వహించారని షీలాదేవి తెలిపారు.
కొత్త పెళ్లి కూతరు పడకగదిలో మద్యం సీసాల కోసం వెతికిన ఘటనపై మాట్లాడేందుకు వైశాలి ఎస్సెస్పీ మనీష్ కుమార్ నిరాకరించారు. ఈ నెల మొదట్లోనూ ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పాట్నాలో ఓ నవ వధువు ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.