సోషలిస్టుల బీద బీహారు

ABN , First Publish Date - 2021-12-03T05:53:27+05:30 IST

నీతి ఆయోగ్ ఇటీవల దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. ఇది ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాల చర్చ...

సోషలిస్టుల బీద బీహారు

నీతి ఆయోగ్ ఇటీవల దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ‘మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్’ పేరిట ఒక నివేదిక విడుదల చేసింది. ఇది ఆయా ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాల చర్చ, ‘విభిన్న కోణాల్లో పేదరిక అధ్యయనం’. ఒకనాడు ‘కూడు, గూడు, గుడ్డ’ ఇవే పేదరిక నిర్ధారణకు మౌలిక సూత్రాలు. కాలానుగుణంగా విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పోషకాహారం, వంట నూనెల లభ్యత తదితర ప్రమాణాలను కూడా పరిగణిస్తూ నీతిఆయోగ్ ఈ అధ్యయనం చేసి నివేదికను విడుదల చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల స్థితి ఉత్తరాది రాష్ట్రాల కంటే మెరుగ్గానే ఉంది. ఉత్తరాదిన బీహారు అన్ని రాష్ట్రాల కంటే వెనుకబడి ఉంది. బీహారులో 50 శాతానికి పైగా ప్రజల్లో ఇంకా కడుపేదరికం ఉందంటే ఇన్నాళ్లు ఆ రాష్ట్రాన్ని పాలించిన వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బీహారు రాష్ట్ర జనాభా 2011 లెక్కల ప్రకారం 10 కోట్లు పైనే. ఇందులో 50 శాతం మంది, అంటే 5 కోట్లకు పైనే ప్రజలు విభిన్న కోణాల్లో పేదరికాన్ని అనుభవిస్తున్నారు. బీహారుకు దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యేకత ఉంది. స్వతంత్ర పోరాటంలో ఆ రాష్ట్రానిది పెద్ద చరిత్ర. చంపారన్ సత్యాగ్రహం అక్కడే జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో మొదటగా నినదించిన గొంతులు ఇక్కడి నుండే వినిపించాయి. సోషలిస్ట్ రాజకీయాలకు పురిటిగడ్డ. జయప్రకాష్ నారాయణ (జేపీ) దీనికి ఆద్యులు. జేపీ మద్దతుదారులుగా సోషలిస్ట్ నేతలుగా ముద్రపడ్డ లాలూ, నితీష్ వంటి వారు రాష్ట్రాన్ని ఏళ్ల తరబడి పాలించారు. కానీ సోషలిస్ట్ రాజ్యంలో మెరుగుపడాల్సిన జీవన ప్రమాణాలేవీ మెరుగుపడలేదు. పైపెచ్చు ఈ రాష్ట్రం జంగిల్ రాజ్, గూండా రాజ్ అనే పేరు సంపాదించుకుంది. లాక్ డౌన్ కాలంలో రక్తమోడుతున్న కాళ్లతో ఇంటి బాట పట్టిన వేలాది కార్మికులు బీహారు ప్రాంతం వారే. ఇదే సర్వేలో 37శాతం మంది పేదరికం అనుభవిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ కూడా సోషలిస్టు ములాయం ఏలుబడిలో ఎక్కువకాలం ఉంది. దేశంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా మతం, మందిరం, మసీదు, కులం, వారసత్వం వంటి అంశాలను దాటి అభివృద్ధి చర్చ జరగని చోట అభాగ్యుల ఆక్రందనలకు విలువ దక్కుతుందా? 

పచ్చల రాజేష్

Updated Date - 2021-12-03T05:53:27+05:30 IST