113 మందికి కరోనా వ్యాప్తి చేసిన వరుడి తండ్రిపై పోలీసు కేసు

ABN , First Publish Date - 2020-07-04T01:12:17+05:30 IST

కరోనా వైరస్ సోకిన కుమారుడికి పెళ్లి జరిపించి 113 మందికి కరోనా వ్యాప్తి చేసిన వరుడి తండ్రిపై పట్నా పోలీసులు కేసు నమోదు చేశారు.....

113 మందికి కరోనా వ్యాప్తి చేసిన వరుడి తండ్రిపై పోలీసు కేసు

పట్నా (బీహార్) : కరోనా వైరస్ సోకిన కుమారుడికి పెళ్లి జరిపించి 113 మందికి కరోనా వ్యాప్తి చేసిన వరుడి తండ్రిపై పట్నా పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహం అనంతరం రెండు రోజులకే వరుడు మరణించగా, పెళ్లికి వచ్చిన 113 మందికి కరోనా వ్యాపించింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు వరుడి తండ్రి అంబికా చౌదరిపై కేసు నమోదు చేశారు. పెళ్లిలో కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించి కరోనా వైరస్ ప్రబలేందుకు కారణమయ్యారు. పెళ్లికి ముందు వరుడు పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకున్నాడని తేలింది. వరుడు మరణించాక నిబంధనలు పాటించకుండా దహనం చేశారు. ఈ ఘటనపై కలెక్టరు కుమార్ రవి దర్యాప్తు చేయగా వరుడి తండ్రి నిబంధనలు ఉల్లంఘించారని, పెళ్లికి వచ్చిన వారు కనీసం మాస్క్ లు ధరించలేదని తేలింది. వరుడి తండ్రి అంబికా చౌదరికి కూడా కరోనా పాజిటివ్ అని రిపోర్టులో తేలింది. 

 బీహార్ రాష్ట్రంలోని దీహపాలికి గ్రామానికి చెందిన 30 ఏళ్ల వరుడు గురుగ్రామ్ నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పనిచేసేవాడు.యువకుడు పెళ్లి చేసుకునేందుకు మే 12వతేదీన తన స్వగ్రామమైన దీహపాలికి వచ్చాడు. ఈ కాలంలో యువకుడికి కరోనా సోకింది. అయినా అతను పాలిగంజ్ సమీపంలోని ఓ గ్రామంలో జూన్ 15 వతేదీన ఓ యువతిని  వివాహమాడారు. వివాహం చేసుకున్న రెండు రోజులకే వరుడి ఆరోగ్య క్షీణించడంతో అతన్ని పట్నాలోని ఎయిమ్స్ కు తీసుకువెళుతుండగా మార్గమధ్యంలోనే మరణించాడు. వరుడి బంధువులు కరోనా పరీక్ష చేయించకుండానే అతని మృతదేహాన్ని దహనం చేశారు.వివాహానికి 50 మంది అతిథులను మాత్రమే అనుమతించాలని, వేడుకలో సామాజిక దూరం పాటించాలనే నియమాలను ఉల్లంఘించారు. పెళ్లికి వచ్చిన అతిథులకు కరోనా పరీక్షలు చేయగా వారిలో 95 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా వధువుకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని వచ్చింది. ఈ పెళ్లి వల్లనే అత్యధికంగా 113 మందికి కరోనా వ్యాపించిందని తేలడంతో జిల్లా అధికారులు అప్రమత్తమై వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. 

Updated Date - 2020-07-04T01:12:17+05:30 IST