Big Shock To Mamatha: మమతకు మరో పెద్ద షాకిచ్చిన బీజేపీ

ABN , First Publish Date - 2022-09-19T19:05:02+05:30 IST

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారతీయ జనతా పార్టీ పెద్ద షాకిచ్చింది.

Big Shock To Mamatha: మమతకు మరో పెద్ద షాకిచ్చిన బీజేపీ

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారతీయ జనతా పార్టీ పెద్ద షాకిచ్చింది. నందిగ్రామ్‌లోని భెకూటియా సమాబే కృషి సమితి కోఆపరేటివ్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 12 సీట్లకు గాను 11 చోట్ల నెగ్గింది. ఒక్క సీటు మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ నెగ్గింది. 2021లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి సువేందు అధికారి ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై గెలిచి సంచలనం సృష్టించారు. మళ్లీ ఇప్పుడు మమతకు, ఆమె సారధ్యంలోని టీఎంసీకి గట్టి షాకిచ్చారు. 


సువేందు ఒకప్పుడు మమతకు కుడి భుజం


వాస్తవానికి సువేందు కూడా ఒకప్పుడు టీఎంసీ నేతయే. మమతకు కుడిభుజంగా ఉండేవారు. అయితే 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు బీజేపీలో చేరి ప్రత్యర్థిగా మారారు. దీంతో మమత తాను చాలాకాలంగా ప్రాతినిధ్యం వహిస్తోన్న భవానీపూర్ నియోజకవర్గాన్ని కాదని సువేందు పోటీచేస్తున్న నందిగ్రామ్ నుంచి తలపడ్డారు. స్వల్ప ఆధిక్యంతో సువేందు నెగ్గడంతో ఇక్కడ మమత పరాజయం పాలయ్యారు. నిజానికి 292 అసెంబ్లీ స్థానాలకు గానూ తృణమూల్ తొలిసారిగా 215 స్థానాలను గెలుచుకుంది. అంత స్వీప్‌లో కూడా మమత సువేందును ఓడించలేక చతికిలపడ్డారు. 


నందిగ్రామ్‌ సువేందు కుటుంబానికి అడ్డా 


నందిగ్రామ్‌లో సువేందు అధికారి కుటుంబానికి గట్టిపట్టుంది. సువేందు తండ్రి శిశిర్ ఎంపీ. మన్మోహన్ కేబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. సువేందు సోదరుడు దిబ్యేందు అధికారి కూడా ఎంపీ. వీరిద్దరూ తృణమూల్ ఎంపీలే అయినా బీజేపీకి అనుకూలంగా ఉంటున్నారు. 


మమతకు మరోసారి ఆశాభంగం


సువేందు బీజేపీలో చేరి గట్టిగా సవాలు విసురుతుండటంతో నందిగ్రామ్‌లో చేసే ప్రతి పోటీనీ టీఎంసీతో పాటు మమత కూడా ప్రతిష్టగా తీసుకుంటారు. భెకూటియా సమాబే కృషి సమితి కోఆపరేటివ్ బాడీ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడంతో తృణమూల్‌ వర్గాలు డీలా పడిపోయాయి. సువేందుపై ఎలాగైనా గెలవాలనుకున్న మమతకు మరోసారి ఆశాభంగం ఎదురైంది. 


మమతను మరోసారి ఓడించిన కమలనాథులు సంబరాల్లో మునిగిపోయారు. నందిగ్రామ్‌పై తమ పట్టు కొనసాగుతుండటంతో సువేందు కుటుంబ సభ్యులు కూడా తాజా ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. నందిగ్రామ్‌ ఇప్పుడే కాదు ఎప్పటికైనా సువేందు అడ్డాయే అని బీజేపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2022-09-19T19:05:02+05:30 IST