HYD : నష్టాల ఊబిలో కూరుకుపోతున్న మెట్రోకు భారీ ఊరట
ABN , First Publish Date - 2022-03-08T12:16:41+05:30 IST
నష్టాల ఊబిలో కూరుకుపోతున్న హైదరాబాద్ మెట్రోను ఆదుకునేందుకు ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ : నష్టాల ఊబిలో కూరుకుపోతున్న హైదరాబాద్ మెట్రోను ఆదుకునేందుకు ప్రభుత్వం తాజా బడ్జెట్లో గతం కంటే పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. మెట్రో కారిడార్-2లో మిగిలిన పాతబస్తీ మార్గాన్ని పూర్తి చేసేందుకు తాజా బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. తాజాగా ఫలక్నుమా వరకు మెట్రో పొడిగించేందుకు నిధులు కేటాయించడంతో ఎల్అండ్టీ పనులు ప్రారంభించనుంది. మరో రూ. 1200 కోట్లు ఇస్తేనే పనులు సకాలంలో పూర్తవుతాయని పేర్కొంటోంది. శంషాబాద్ వరకు మెట్రో సేవలను పొడిగిస్తామని 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పనుల్లో జీఎంఆర్ సంస్థను కూడా జత చేసింది. 31 కిలో మీటర్ల మార్గానికి సుమారు రూ.4వేల కోట్ల నుంచి 5 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని ఎల్అండ్టీ ఆంచనా వేసి మూడేళ్ల క్రితమే డీపీఆర్ను సిద్ధం చేసింది. తాజా బడ్జెట్లో రూ.377.35 కోట్లు కేటాయించడంతో ఈ పనులకు అంకురార్పణ జరిగే అవకాశం ఉంది.
రూ. 1500 కోట్లు
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎల్అండ్టీని ఆదుకోవడంలో భాగంగా 2020-21 వార్షిక బడ్జెట్లో కేవలం రూ.20 కోట్లను మాత్రమే ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. 2021-22లో రూ.1000 కోట్లు, తాజా బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.1000 కోట్లలో కేవలం రూ.200 కోట్లు మాత్రమే ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుత కేటాయింపుల్లో ఎంత వరకు చెల్లిస్తారనేది వేచి చూడాలి.