పోలాండ్లో పర్యటించనున్న బైడెన్
ABN , First Publish Date - 2022-03-21T18:35:49+05:30 IST
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్లో పర్యటించనున్నారు. వచ్చే శుక్రవారం ఆయన పోలాండ్ రాజధాని వార్సా చేరుకోనున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పోలాండ్లో పర్యటించనున్నారు. వచ్చే శుక్రవారం ఆయన పోలాండ్ రాజధాని వార్సా చేరుకోనున్నారు. పోలాండ్.. ఉక్రెయిన్ సరిహద్దు దేశమనే సంగతి తెలిసిందే. ఉక్రెయిన్ నుంచి ఎక్కువ మంది ప్రజలు పోలాండ్కు వలస వెళ్తున్నారు. ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ ప్రజలు పోలాండ్ చేరుకున్నట్లు అంచనా. దీంతో ప్రపంచంలోనే అత్యధిక మంది శరణార్థులు తలదాచుకుంటున్న దేశాల్లో పోలాండ్ ఒకటిగా నిలిచింది.
తాజా పరిస్థితుల నేపథ్యంలో జో బైడెన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. బైడెన్ వార్సాలో పోలాండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ డ్యూడాతో సమావేశమవుతారు. ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న దాడి, అక్కడ పౌరులకు కలుగుతున్న నష్టం, మానవ హక్కుల ఉల్లంఘన వంటి అంశాల్లో అమెరికా, నాటో, అమెరికా మిత్రదేశాలు పోలాండ్తో కలిసి ఎలా సాగాలి అనే అంశంపై చర్చిస్తారు. పోలాండ్ పర్యటనకు ముందు నాటో దేశాలు, జీ7 దేశాలు, యూరోపియన్ యూనియన్ నాయకులతో బైడెన్ ఒక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్కు ఎలాంటి సహకారం అందించాలనే అంశంపై చర్చిస్తారు.