తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్!
ABN , First Publish Date - 2021-08-19T01:44:00+05:30 IST
అఫ్ఘానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా తాజాగా భారీ షాక్ ఇచ్చింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం యూఎస్లోని అఫ్ఘానిస్థాన్ నిధుల విషయమై కీలక ప్రకటన చేసింది.
వాషింగ్టన్: అఫ్ఘానిస్థాన్ను హస్తగతం చేసుకున్న తాలిబన్లకు అగ్రరాజ్యం అమెరికా తాజాగా భారీ షాక్ ఇచ్చింది. జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం యూఎస్లోని అఫ్ఘానిస్థాన్ నిధుల విషయమై కీలక ప్రకటన చేసింది. తమ దేశంలోని బ్యాంకుల్లో ఉన్న అఫ్ఘానిస్థాన్కు చెందిన నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్టు యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ జానెట్ యెలెన్ ప్రకటించారు. సుమారు 9.5 బిలియన్ డాలర్ల(రూ.7,05,63,34,00,000) మేర నిధులను ఫ్రీజ్ చేసినట్టు చెప్పారు. యునైటెడ్ స్టేట్స్లో అఫ్ఘన్ ప్రభుత్వం కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు తాలిబన్లకు అందుబాటులో ఉండవని ఈ సందర్భంగా జానెట్ యెలెన్ పేర్కొన్నారు. తాలిబన్ల చేతిలో నిధులు దుర్వినియోగం అవుతాయన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాజధాని కాబూల్ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిన తర్వాత వారికి నిధులు అందుబాటులో లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే అమెరికా ఈ చర్యకు ఉపక్రమించింది. ఇక ఇప్పటికే జర్మనీ అఫ్ఘాన్కు కేటాయించిన అభివృద్ధి నిధులను నిలిపివేసిన విషయం తెలిసిందే.