భూ సర్వే వేగవంతం
ABN , First Publish Date - 2022-09-29T06:24:01+05:30 IST
సమగ్ర భూ రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు.
రైతుల సందేహాలను నివృత్తి చేయాలి
అధికారులకు జేసీ కల్పనాకుమారి ఆదేశం
అనకాపల్లి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సమగ్ర భూ రీ-సర్వే పనులను మరింత వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, సర్వే అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, భూ రికార్డులను సవరించి రైతులకు స్పష్టమైన సరిహద్దులు తెలియజేయాలని చెప్పారు. సర్వే జరగడం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి, వారి సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్ఓ వెంకటరమణ, అనకాపల్లి ఆర్డీఓ చిన్నికృష్ణ, నర్సీపట్నం ఆర్డీఓ భవానీ శంకర్, అన్ని మండలాల తహసీల్దార్లు, వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు.
అంతకు ముందు నక్కపల్లి మండలంలో విశాఖ-చెన్నై పెట్రో కారిడార్ కోసం కాగిత గ్రామం నుంచి అమలాపురం వరకు నిర్మించనున్న రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు జాయింట్ కలెక్టర్ను కలిశారు. ఎకరానికి రూ.80 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని వారు కోరగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత ఎక్కువ ప్యాకేజీ అందించేందుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.